వార్ 2 కోసం సరికొత్త టెక్నాలజీ

జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలయికలో రూపొందుతున్న వార్ 2 కోసం నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్ సరికొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోనుంది. కనివిని ఎరుగనిది కాకపోయినా ఇంత భారీ మొత్తంలో వాడుతున్న ప్యాన్ ఇండియా మూవీగా ప్రత్యేకతను సంతరించుకోబోతోంది వార్ 2 అవుట్ డోర్ లో వచ్చే కీలకమైన యాక్షన్ ఎపిసోడ్స్ పూర్తిగా బాడీ డబుల్స్ తో తీస్తారు. ఆ తర్వాత విఎఫెక్స్ ని వాడి తారక్, హృతిక్ ల మొహాలను స్వాప్ చేయడం ద్వారా గ్రాఫిక్స్ వాడిన అనుమానం రాకుండా ప్లాన్ చేస్తారు. మోషన్ సాంకేతికత కీలకంగా ఉంటుంది. రెగ్యులర్ పద్దతితో అయితే డూప్లతో పాటు హీరోలు కూడా లొకేషన్లోనే ఉంటారు. వార్ 2 సెట్లో హీరోలు ఉండరు.

ఇద్దరు స్టార్లు పాల్గొనే అధిక శాతం షూట్ స్టూడియోస్ లో చేయబోతున్నారు. హృతిక్ మార్చి 7 నుంచి సెట్స్ లో అడుగు పెట్టాడు. మొత్తం 55 నుంచి 60 కాల్స్ షీట్లలోనే తన భాగం పూర్తి చేసేలా దర్శకుడు అయాన్ ముఖేర్జీ ప్లాన్ సిద్ధం చేసుకున్నాడు. తారక్ ఏప్రిల్ నుంచి తోడవుతున్నాడు. ఈ ఇద్దరి కాంబో సీన్లు, ఘట్టాలు ముంబైలోనే ఎక్కువగా జరుగుతాయట. జూన్ లేదా జూలై లోగా హృతిక్ తన భాగాన్ని పూర్తి చేసుకునేలా సెట్ చేశారని తెలిసింది. జూనియర్ సోలో సీన్లు వేసవిలోగా ఫినిష్ చేసి ఏడాది సమయాన్ని కేవలం స్పెషల్ ఎఫెక్ట్స్, పోస్ట్ ప్రొడక్షన్ కోసం కేటాయించబోతున్నారు.

వచ్చే ఏడాది ఆగస్ట్ లో విడుదల కాబోతున్న వార్ 2కి ఎంత బడ్జెట్ అవుతుందనేది నిర్మాతలు చెప్పడం లేదు కానీ యష్ బ్యానర్ లో ఖరీదైన మూవీగా చెప్పుకుంటున్నారు. హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తుండగా ఇంకొకరిని కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. ఇండియన్ సీక్రెట్ ఏజెంట్ గా తారక్ పాత్ర ఉంటుందని ఆల్రెడీ లీక్ వచ్చేసిన నేపథ్యంలో అభిమానుల అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ముఖ్యంగా హృతిక్ తో ఫేస్ టు ఫేస్ ఎలాంటి ఫైట్లు ఉంటాయోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం జూనియర్ అక్టోబర్ రిలీజ్ కు రెడీ అవుతున్న దేవర పనుల్లో బిజీగా ఉన్నాడు.