జాక్ పాట్ కొట్టనున్న మృణాల్ ఠాకూర్

టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మొదటి రెండు సినిమాలతోనే బ్లాక్ బస్టర్లు అందుకున్న మృణాల్ ఠాకూర్ అవకాశాల విషయంలో ఆచితూచి అడుగులు వేయడం తనకు మేలే చేస్తోంది. సీతారామం తర్వాత హాయ్ నాన్నలో పాప తల్లిగా నటించినా దాని ప్రభావం ఆఫర్ల మీద పడలేదు సరికదా పెర్ఫార్మన్స్ పరంగా ఇంకో కోణాన్ని కొత్తగా పరిచయం చేసింది. అందులోనూ దుల్కర్ సల్మాన్, నాని లాంటి టాలెంటెడ్ హీరోల సరసన జోడి కట్టడం చాలా ప్లస్ అయ్యింది. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ లో భార్యగా మంచి స్కోప్ ఉన్న పాత్రనే దర్శకుడు పరశురామ్ డిజైన్ చేశాడట.

ఇదిలా ఉండగా దర్శకుడు హను రాఘవపూడి హీరో ప్రభాస్ కాంబోలో తెరకెక్కబోయే భారీ ప్యాన్ ఇండియా మూవీలో మృణాల్ ని తీసుకునే ఆలోచన జరుగుతున్నట్టు ఇన్ సైడ్ టాక్. సీతారామంలో ఆమెను చాలా బాగా చూపించిన హను మరోసారి అలాంటి క్యారెక్టర్ ప్లాన్ చేశారని తెలిసింది. కథ లాక్ అయిపోయి ఫైనల్ స్క్రిప్ట్ స్టేజిలో ఉన్న ఈ పీరియాడిక్ డ్రామాకు ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. విశాల్ భరద్వాజ్ ట్యూన్లను ఓకే చేసుకునే పనిలో టీమ్ బిజీగా ఉంది. షూటింగ్ కి ఇంకా చాలా టైం ఉండటంతో ప్రీ ప్రొడక్షన్ పనులను ఒక ప్లాన్ ప్రకారం చేసుకుంటున్నారు.

ఇది కనక లాక్ అయితే మృణాల్ ఠాకూర్ సుడి తిరిగినట్టే. చిరంజీవి విశ్వంభరలోనూ తీసుకున్నారనే టాక్ ఉంది కానీ యూనిట్ నుంచి అధికారిక కన్ఫర్మేషన్ రావడం లేదు. ఫోటోలు కూడా చెల్లెల్లుగా నటిస్తున్న హీరోయిన్లవి లీకవుతున్నాయి కానీ వాటిలో ఎక్కడ మృణాల్ లేదు. ఎటొచ్చి బాలీవుడ్ లో సెటిలవుదామని చూస్తున్న ఈమెకు కెరీర్ పరంగా మంచి బ్రేక్స్ తెలుగులోనే దక్కడంతో క్రమంగా హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యే ఆలోచన కూడా చేస్తోందట. గ్లామర్ షో చేయడానికి సిద్ధంగా ఉన్నా సీతారామం దెబ్బకు మన దర్శకులు ఆమెను హోమ్లీగా చూపించేందుకే ఇష్టపడటం విశేషం.