రెండేళ్ల ముందే కంగనకు నోటీసులు.. నిజమా?

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్ అయిపోయింది. ఆమె వ్యవహారం చూస్తుంటే అతి త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేసేలా కనిపిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కంగనాకు పూర్తి మద్దతునిస్తూ మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన సర్కారుపైకి ఉసిగొల్పుతోందన్నది స్పష్టం.

అక్కడి ప్రభుత్వం మీద ఆమె కొన్ని రోజులుగా ఎలా విరుచుకుపడుతోందో చూస్తూనే ఉన్నాం. అటు వైపు నుంచి కూడా అదే స్థాయిలో స్పందన వస్తోంది. తాజాగా ఈ గొడవ మరో స్థాయికి చేరింది. ముంబయిలోని కంగనా కార్యాలయం అక్రమ నిర్మాణం అంటూ దాన్ని కూలగొట్టే ప్రయత్నం చేసింది బొంబాయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ). బొంబాయి హైకోర్టు దీనిపై స్టే విధించే లోపు దాన్ని చాలా వరకు కూలగొట్టేశారు కూడా.

ఇదిలా ఉంటే.. కంగనా కార్యాలయంలో అక్రమ నిర్మాణాల గురించి రెండేళ్ల కిందటే ఆమెకు నోటీసులు పంపినట్లు బీఎంసీ అధికారి ఒకరు పేర్కొన్నారు. దీంతో తప్పు కంగనాదే అన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ దీనికి కంగనా దీటుగా బదులిచ్చింది. తన కార్యాలయానికి సంబంధించి బీఎంసీ రెండేళ్ల కిందటే నోటీసులిచ్చారనడం పూర్తి అబద్ధమని.. అది నిజమే అని రుజువు చేయాలని బీఎంసీ అధికారులకు సవాలు విసిరింది. తన ఆఫీస్ అక్రమంగా నిర్మించిందైతే ఇన్నేళ్లుగా సైలెంటుగా ఉండి ఉన్నట్లుండి ఈ రోజు బీఎంసీ ఎందుకు విధ్వంసానికి దిగిందని.. కేవలం 24 గంటల వ్యవధిలో ఇది అక్రమ నిర్మాణంగా మారిపోయిందా అని ఆమె ప్రశ్నించింది.

#Shameonmahagovt.. #deathofdemocracy అని హ్యాష్ ట్యాగ్స్ పెట్టి మహారాష్ట్ర సర్కారు మీద ఆమె తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేసింది. తన కార్యాలయాన్ని కూలగొట్టిన ఫొటోలు, వీడియోలను ఆమె ట్విట్టర్లో షేర్ చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వానికి, బొంబాయి మున్సిపల్ కార్పొరేషన్‌కు అనేక ప్రశ్నలు సంధించింది.