ఎస్ఎస్ఎంబి 29 కోసం హాలీవుడ్ అతిథులు

సూపర్ స్టార్ మహేష్ బాబు – రాజమౌళి కలయికలో రూపొందబోయే ప్యాన్ వరల్డ్ మూవీ ఎప్పుడు మొదలవుతుందాని అభిమానులతో పాటు యావత్ ప్రేక్షక లోకం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఆర్ఆర్ఆర్ కి జక్కన్న ఇద్దరు హీరోలను వెంటపెట్టుకుని ఒక గ్రాండ్ ప్రెస్ మీట్ ద్వారా వివరాలు తెలియజేశాడు. మీడియాతో క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ సెషన్ కూడా జరిగింది. ఈసారి దానికి భిన్నంగా చాలా గ్రాండ్ గా ఓపెనింగ్ ప్రోగ్రాం ప్లాన్ చేయాలని చూస్తున్నారట. దీని కోసం అంతర్జాతీయ మీడియాను సైతం భాగం చేయాలనే ఆలోచన సీరియస్ గా జరుగుతున్నట్టు ఇన్ సైడ్ టాక్.

ఒకవేళ ఇది నిజమైతే అవతార్ సృష్టికర్త జేమ్స్ క్యామరూన్, రాజమౌళి విపరీతంగా ఆరాధించే స్టీవెన్ స్పీల్బర్గ్ లను తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసింది. ఇద్దరూ ఒకేసారి సాధ్యం కాకపోతే కనీసం ఒక్కరిని తీసుకొచ్చేలా ఎస్ఎస్ కార్తికేయ ఆల్రెడీ రంగంలోకి దిగినట్టు వినిపిస్తోంది. ఆర్ఆర్ఆర్ ని విపరీతంగా ఇష్టపడిన ఈ లెజెండరీ డైరెక్టర్స్ కనక వస్తే దేశ దేశాల్లో దీని కవరేజ్ మోత మోగిపోతుంది. మహేష్ బాబు కథ కోసం ఇండియానా జోన్స్ ని స్ఫూర్తిగా తీసుకున్న రాజమౌళి ఇప్పుడు ఏకంగా దానికి దర్శకత్వం వహించిన స్పీల్బర్గ్ ని తేవడమంటే మాటలు కాదు.

ఇవన్నీ ప్రస్తుతం ఎలాంటి ధృవీకరణ లేని వార్తలే అయినా విశ్వసనీయ వర్గాలు మాత్రం నిప్పు లేనిదే పొగరాదు తరహాలో మాట్లాడుకుంటున్నాయి. నిర్మాణ సంస్థ దుర్గ ఆర్ట్స్ అయినప్పటికీ మరికొన్ని జాతీయ అంతర్జాతీయ సంస్థలు నిర్మాణ భాగస్వామ్యంలో ఉంటాయనే వార్తలు కూడా బలంగా తిరుగుతున్నాయి. వాటిలో నెట్ ఫ్లిక్స్ కూడా ఉందనే ప్రచారం ఊపందుకుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ కి తుదిమెరుగులు దిద్దుతున్నారట. క్యాస్టింగ్ కి సంబంధించిన ఎంపిక పనులు రాజమౌళి ఏ చిన్న లీక్ లేకుండా చూసుకుంటున్నారట. పాటల పనులు కీరవాణి త్వరలో మొదలుపెట్టబోతున్నారు.