ఏప్రిల్ సినిమాలకు ఎన్నికల సెగలు

ఏ క్షణమైనా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలా ఉంది. తెలంగాణతో పోలిస్తే ఈసారి ఏపీ ఎలక్షన్లు వాడివేడిగా ఉండబోతున్నాయి. అధికార వైసిపి, ప్రతిపక్షం టీడీపీ-జనసేనల పొత్తు పరస్పరం ఎలా తలపడతాయనే దాని మీద సామాన్య జనం విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు. మీడియా టాక్ ప్రకారం నామినేషన్లు మార్చి 28 నుంచి ప్రారంభమవుతాయి. పోలింగ్ ఏప్రిల్ 19 జరిగే అవకాశముంది. 25 ఫలితాలు ప్రకటించి అదే నెల 30 కొత్త ప్రభుత్వం కొలువు తీరేలా షెడ్యూల్ చేస్తారని తెలిసింది. అధికారికంగా వచ్చేదాకా దీన్ని ఖరారు చేయలేం వార్త విశ్వసనీయమే.

దీనికి సినిమాలకు సంబంధం లేకపోలేదు. ఒకపక్క ప్రచారాల హోరులో తడిసిపోతున్న జనాలు అంత సులభంగా థియేటర్లకు రారు. పెద్ద స్టార్ హీరోలు మాత్రమే ఈ పరిస్థితిని ఎదురీది ఆడియన్స్ ని రప్పించగలరు. ఏప్రిల్ లో చెప్పుకోదగ్గ వాటిలో 5న వచ్చే విజయ్ దేవరకొండా ఫ్యామిలీ మ్యాన్ ప్రధానమైంది. పాజిటివ్ టాక్ తెచ్చుకుని ఓ రెండు వారాలు గట్టిగా ఆడినా చాలు నిర్మాత దిల్ రాజుకు మొత్తం రికవర్ అయిపోతుంది. దేవర ఎలాగూ తప్పుకుంది కాబట్టి ఇబ్బంది లేదు. గ్యాంగ్స్ అఫ్ గోదావరిని ఏప్రిల్ 19 రిలీజ్ గురించి దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారు.

ఒకవేళ ఎన్నికల గోలలో ఎందుకనుకుంటే మేకి షిఫ్ట్ చేయొచ్చు. ముందు జాగ్రత్త చర్యగా ప్యాన్ ఇండియా సినిమాలేవీ ఏప్రిల్ వైపు కన్నెత్తి చూడటం లేదు. తెలంగాణ ఎలక్షన్ల సమయంలో వాతావరణం ఇంత వేడిగా లేదు. కానీ ఏపీలో దానికి పూర్తి రివర్స్ లో ఉంది. పొలిటికల్ వార్ కంటే ఎంటర్ టైన్మెంట్ ఏముంటుందనే రీతిలో పబ్లిక్ కి కావాల్సిన కాలక్షేపం దొరికేలా ఉంది. విశాల్ రత్నం, విక్రమ్ తంగలాన్ లు ఆ నెలలో రావాలని చూస్తున్నాయి కానీ డేట్లు కొంచెం అటుఇటు కావొచ్చు. ఎలా చూసుకున్నా టాలీవుడ్ కు ఎన్నికల సెగ అంత సీరియస్ గా ఉండదనేద వాస్తవం.