హిందీ సినిమాలపై బాలీవుడ్ లెజెండ్ విమర్శలు

బాలీవుడ్ లెజెండరీ నటుల్లో నసీరుద్దీన్ షా ఒకరు. ఆయన నట కౌశలం గురించి చెప్పడానికి ఎన్నో ఉదాహరణలున్నాయి. ఐతే నసీరుద్దీన్ షా ఈ మధ్య బాలీవుడ్లో అంత యాక్టివ్‌గా లేరు. సెలక్టివ్‌గా రోల్స్ ఎంచుకుంటున్నారు. తన అభిరుచికి తగ్గ పాత్రలు రావట్లేదని, అందుకే ఎక్కువ సినిమాలు చేయట్లేదని ఆ మధ్య ఆయన వ్యాఖ్యానించారు కూడా.

ప్రస్తుతం హిందీలో తెరకెక్కుతున్న చిత్రాల విషయంలో ఆయన చాలా అసంతృప్తితో ఉన్న విషయం స్పష్టంగా తెలిసిపోతోంది. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన బాలీవుడ్ సినిమాలపై కొంచెం ఘాటైన విమర్శలే చేశారు. తాను ఈ మధ్య హిందీ సినిమాలు చూడడం పూర్తిగా మానేసినట్లు ఆయన వెల్లడించారు. హిందీ చిత్రాల క్వాలిటీ పడిపోయిందని.. వాటి తీరే మారిపోయిందని ఆయన అన్నారు.

హిందీ సినిమాకు వందేళ్ల చరిత్ర ఉందని ఘనంగా చెప్పుకుంటామని.. కానీ ప్రస్తుతం హిందీలో ఒకే రకమైన సినిమాలు తెరకెక్కుతున్నాయని నసీరుద్దీన్ షా వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు హిందీ సినిమాలు చూసేందుకు థియేటర్లకు వెళ్తుంటారని.. త్వరలోనే ఆ పరిస్థితి మారుతుందని అనిపిస్తోందని షా అన్నారు. హిందీ సినిమాల విషయంలో ప్రేక్షకులు విసుగెత్తిపోతున్నారని.. కేవలం డబ్బు కోసమే సినిమాలు తీయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తుతోందని.. ఈ తీరు మారాలని ఆయనన్నారు.

వాస్తవిక దృక్పథంతో సినిమాలు తీయడం ఫిలిం మేకర్స్ బాధ్యత అన్న నసీరుద్దీన్ షా.. గతంలో ఇరాన్ ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదురైనప్పటికీ అక్కడి ఫిలిం మేకర్స్ ధైర్యంగా మంచి సినిమాలు తీశారని.. వారి నుంచి మన వాళ్లు స్ఫూర్తి పొందాలని షా వ్యాఖ్యానించారు. బాలీవుడ్ మీద సౌత్ మూవీస్ ప్రభావం ఎక్కువై హీరో సెంట్రిగ్గా సినిమాలు తీస్తున్నారంటూ షా గతంలో విమర్శలు చేశారు. ఆయన ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ లాంటి సినిమాల గురించి వ్యతిరేకంగా మాట్లాడారు. మణిరత్నం తీసిన ‘పొన్నియన్ సెల్వన్’ను మాత్రం కొనియాడారు.