షారుఖ్ కన్నా ప్రభాస్ మహేషే ముద్దు

ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసిన అభిమానుల నిరీక్షణకు తెర దించుతూ డంకీ హఠాత్తుగా ఫిబ్రవరి 15 నుంచి నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ మొదలైపోయింది. బాక్సాఫీస్ వద్ద పఠాన్, జవాన్ అంత గొప్పగా ఆడకపోయినా నాలుగు వందల కోట్లకు పైగా వసూళ్లతో డీసెంట్ గానే బయట పడ్డ సంగతి తెలిసిందే. కాకపోతే సలార్ పోటీని తట్టుకుని విజేతగా నిలుస్తుందనే అంచనాలు తలకిందులయ్యాయి. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన సినిమాల్లో ఇదే అత్యంత వీక్ వర్క్ గా విమర్శకులు తేల్చి చెప్పారు. దీనికి మహేష్ బాబు, ప్రభాస్ లకు కనెక్షన్ ఏంటనే పాయింట్ కు వద్దాం.

మాములుగా నెట్ ఫ్లిక్స్ ఏదైనా స్టార్ హీరో మూవీ రిలీజ్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన ప్రమోషన్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. వారం పది రోజుల ముందే సోషల్ మీడియా సౌండ్ మొదలైపోతుంది. ప్రత్యేక ప్రకటనలు ఇస్తుంది. స్పెషల్ గా ట్రైలర్లు కట్ చేయిస్తుంది. గుంటూరు కారం కోసం హైదరాబాద్ లో ఓ అయిదు అంతస్థుల బిల్డింగ్ సైడ్ వాల్ మీద మహేష్ బాబు భారీ పెయింటింగ్ వేయించడం బాగా వైరల్ అయ్యింది. ప్రభాస్ కి సైతం యాడ్స్ తో హోరెత్తించి ఆడియన్స్ ని అలెర్ట్ చేస్తూ వచ్చింది. యానిమల్ కు సైతం బాగానే హడావిడి చేసింది.

వీటిలో ఏదీ డంకీకి చేయకపోవడం అభిమానులను షాక్ కి గురి చేసింది. రెండు వెయ్యి కోట్ల బ్లాక్ బస్టర్లు ఇచ్చిన హీరోకి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ కస్సుమన్నారు. షారుఖ్ ప్రత్యేకంగా ఓటిటి స్ట్రీమింగ్ కోసం నటించిన యాడ్ ని ఇన్స్ టాలో వేశారు తప్పించి దాన్ని ఇంకా బాగా జనంలోకి తీసుకెళ్లేలా నెట్ ఫ్లిక్స్ చొరవ చూపలేదన్నది వాళ్ళ కంప్లయింట్. ఏది ఏమైనా మహేష్ బాబు, ప్రభాస్ ల మీద చూపించిన ప్రత్యేక శ్రద్ధ షారుఖ్ కేసులో కొరవడిందనేది స్పష్టంగా కనిపిస్తోంది. అందుకేగా నెట్ ఫ్లిక్స్ అదే పనిగా తెలుగు మార్కెట్ మీద దృష్టి పెట్టి హక్కుల కోసం వేల కోట్లు కుమ్మరిస్తోంది.