చనిపోయిన హీరోతో అతిథి పాత్ర సాధ్యమే

సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. ముఖ్యంగా ఏఐ(కృత్రిమ మేధస్సు) విప్లవం పెరిగాక దర్శకుల్లో కొత్త ఆలోచనలు మొగ్గ తొడుగుతున్నాయి. విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం (గోట్) లో ఇటీవలే కాలం చేసిన విజయకాంత్ ని క్యామియో రూపంలో పునఃసృష్టించబోతున్నరనే వార్త అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇలా చేయడం కొత్తేమి కాదు. గతంలో కలిసుందాం రా, యమదొంగ పాటల్లో స్వర్గీయ ఎన్టీఆర్ స్టెప్పులను గ్రాఫిక్స్ తో వాడుకున్నారు. కానీ వాటిలో ఒరిజినల్ ఫుటేజ్ నే చూపిస్తారు.

ఇప్పుడలా కాదు. నిజంగానే విజయ్ కాంత్ నటించారా అనేంత సహజంగా క్యారెక్టర్ ఉంటుందట. గోట్ లో విజయ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. ఒక పాత్ర 90 దశకంలో ఉంటుంది. దానికి సంబంధించిన ఎపిసోడ్లలోనే కెప్టెన్ ఎంట్రీ ఉంటుందట. వెంకట్ ప్రభుకి ఆయనంటే విపరీతమైన అభిమానం. డైరెక్ట్ చేసే ఛాన్స్ రాకపోయినా ఎలాగోలా నివాళి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నాడు. దానికి విజయ్ మద్దతు దొరకడం ఈ రకంగా ప్లాన్ చేశారట. ఆల్రెడీ విజయ్ 18 ఏళ్ళ వయసున్న వాడిగా చూపించేందుకు 8 కోట్లు కేవలం ఆ ఒక్క క్యారెక్టర్ విజువల్ ఎఫెక్ట్స్ కే వాడటం విశేషం.

ఇటీవలే లాల్ సలాంలో ఏఆర్ రెహమాన్ చనిపోయిన గాయకుల గొంతులని ఏఐతో మళ్ళీ వాడారు కానీ ఆ ప్రయోగం ట్యూన్స్ బాలేకపోవడం వల్ల ఫెయిల్ అయ్యింది. కానీ విజయ్ కాంత్ విషయంలో అలా జరగకపోవచ్చు. ఇది కనక స్క్రీన్ మీద పేలితే భవిష్యత్తులో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, కృష్ణంరాజు లాంటి లెజెండరీ స్టార్లను మనం కూడా తెరమీద చూసుకోవచ్చు. కాకపోతే భారీగా ఖర్చు అవుతుంది. ఇంకో పది పదిహేను సంవత్సరాలలో ఏఐ టెక్నాలజీ విపరీతంగా అభివృద్ధి చెందుతుందని, ఊహించని అద్భుతాలు చూడొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.