పొలిటికల్ బయోపిక్కులకు కాలం చెల్లింది

సావిత్రి జీవితకథను మహానటి సినిమాగా మలచి నాగ అశ్విన్ కమర్షియల్ గానూ అద్భుత ఫలితం అందుకున్నాక అందరూ అదే దారి పట్టారు. క్రికెటర్ ధోని జీవితం తెరమీద బాగానే ఆడింది. కానీ రాజకీయ నాయకుల కథలు మాత్రం జనాలు రిసీవ్ చేసుకోని వాస్తవం క్రమంగా అవగతమవుతోంది. ఇటీవలే వచ్చిన ‘యాత్ర 2’కి ఎంత బడ్జెట్ పెట్టినా, అధికార పార్టీ నాయకుల ప్రోత్సాహంతో జనాలను థియేటర్లకు తీసుకెళ్లినా అంతగా వర్కౌట్ కావడం లేదు. ఇటీవలే అటల్ బిహారి వాజ్ పాయ్ గారి ‘మై అటల్ హూ’లో పంకజ్ త్రిపాఠి ఎంత గొప్పగా నటించినా లాభం లేకపోయింది.

ఇంతకు ముందు తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత మీద ‘తలైవి’ని కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించి ప్యాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేశారు. కంగనా రౌనత్ పెర్ఫార్మన్స్ అదిరిపోయినా స్వంత రాష్ట్రంలో జనాలకే పట్టలేదు. బాలకృష్ణ తండ్రికి నివాళిగా చేసిన ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సైతం చేదు ఫలితాన్నే అందుకుంది. నవాజుద్దీన్ సిద్ధిక్ తో ‘థాకరే’ చేయిస్తే కనీసం పబ్లిసిటీ ఖర్చులు కిట్టుబాటు కాలేదు. మన్ మోహన్ సింగ్ ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ని ఎవరూ పట్టించుకోలేదు. ‘మోడీ’ పాత్రలో వివేక్ ఒబెరాయ్ అదే టైటిల్ తో మూవీ చేస్తే వచ్చిందనే సంగతే ఎవరికీ గుర్తు లేదు.

ఇక్కడ చెప్పిన ఉదాహరణలన్నీ లెజెండరీ పొలిటీషియన్స్ వే. చరిత్రలో గొప్ప స్థానం సంపాదించుకున్న వాళ్ళవే. అయినా బాక్సాఫీస్ వద్ద పరాభవం తప్పలేదు. అర్థం చేసుకోవాల్సిన వాస్తవం ఏంటంటే బయట రాజకీయ నాయకులను ఎంత ఆరాధించినా వాళ్ళను సినిమాటిక్ స్టైల్ లో చూసేందుకు జనం ఇష్టపడటం లేదు. పైగా వాస్తవాలు దాచి పెట్టి ఎక్కువ శాతం మసిపూసి మారేడుకాయ చేయడమే ఉంటుంది కాబట్టి వీటిని ఆదరణ దక్కడం కష్టమవుతోంది. ఇకనైనా రచయితలు దర్శకులు కొంత కాలం వీటిని ఆపేస్తే బెటరేమో. లేదంటే ఫలితాలు రిపీట్ ఆవుతూనే ఉంటాయి.