మైత్రీకి ఇన్నేళ్లలో చూడని లాభాలు

ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో మైత్రీ మూవీ మేకర్స్ ఒకటి. సినిమాల ఫ్రీక్వెన్స్, రేంజ్ పరంగా దాన్ని నంబర్ వన్ సంస్థ అని కూడా చెప్పొచ్చు. పుష్ప-2 సహా అరడజను దాకా క్రేజీ ప్రాజెక్టులు ఆ సంస్థ చేతిలో ఉన్నాయి. ఈ సంస్థ ప్రస్థానంలో శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, పుష్ప, వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్లు ఉన్నాయి.

ఐతే పెట్టుబడి-రాబడి కోణంలో చూస్తే.. ఆ సంస్థకు బిగ్గెస్ట్ హిట్ లేటెస్ట్ మూవీ ‘హనుమాన్’యే కావడం విశేషం. ఐతే ఇది మైత్రీ ప్రొడ్యూస్ చేసిన చిత్రం కాదు.. డిస్ట్రిబ్యూట్ చేసింది. నైజాం ఏరియాకు ఏడున్నర కోట్లు పెట్టి సినిమా రైట్స్ తీసుకుంది మైత్రీ సంస్థ. సంక్రాంతి పోటీ వల్ల మొదట్లో ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో థియేటర్లు దొరకలేదు. కానీ చివరికి గెలిచేది కంటెంటే అని చాటుతూ.. సంక్రాంతి విజేతగా నిలిచింది హనుమాన్.

మొదట్లో ఉన్న థియేటర్లలోనే హౌస్ ఫుల్స్ పడ్డాయి. తర్వాత ఎగ్జిబిటర్లు ఎగబడి మరీ హనుమాన్ చిత్రాన్ని ప్రదర్శించారు. 5 కోట్లు.. 10 కోట్లు.. 15 కోట్లు.. ఇలా ఒక్కో మార్కును అధిగమిస్తూ.. ఇప్పుడు ఏకంగా రూ.30 కోట్ల షేర్ మార్కును టచ్ చేసింది హనుమాన్ నైజాంలో. గ్రాస్ కలెక్షన్లు 50 కోట్లకు చేరువగా ఉన్నాయి. హనుమాన్ స్థాయి మిడ్ రేంజ్ మూవీ నైజాం ఏరియాలో 30 కోట్ల షేర్ సాధించడం అంటే ఆషామాషీ కాదు. పెద్ద స్టార్లు నటించిన భారీ చిత్రాలే ఈ స్థాయిలో వసూళ్లు రాబడుతుంటాయి.

ఇక మైత్రీ అధినేతల సంబరం అయితే అంతా ఇంతా కాదు. పెట్టుబడి మీద నాలుగు రెట్ల లాభం అంటే.. ఒక డిస్ట్రిబ్యూటర్‌కు ఇంకేం కావాలి? నైజాంలోనే కాదు.. రిలీజైన ప్రతి చోటా పెట్టుబడి మీద కొన్ని రెట్ల లాభం అందించింది హనుమాన్. మూడో వీకెండ్ అయ్యాక కూడా సినిమా జోరు తగ్గలేదు. ఇంకో రెండు వీకెండ్లు సినిమా సత్తా చాటేలా కనిపిస్తోంది.