ఎక్స్‌ట్రా ఫుటేజ్ లేదు…యానిమల్ ఫ్యాన్స్ డీలా

మాములుగా థియేటర్లలో భీభత్సంగా ఆడేసి వెళ్ళిపోయిన బ్లాక్ బస్టర్లు ఓటిటిలో వచ్చినప్పుడు చూసే ఫ్యాన్స్ కోట్లలో ఉంటారు కానీ మరీ అర్ధరాత్రి మేల్కొని షోలు వేయాలనుకునే బ్యాచ్ తక్కువే. కానీ యానిమల్ దీనికి మినహాయింపుగా నిలిచింది. నెట్ ఫ్లిక్స్ లో తాజాగా రిలీజైన డిజిటల్ వెర్షన్ లో అదనపు తొమ్మిది నిమిషాల ఫుటేజ్ ఉంటుందని ముందు నుంచి జరిగిన ప్రచారానికి భిన్నంగా మనం తెరపై చూసిన సెన్సార్ కాపీనే ఉండటంతో అభిమానులు నిరాశ చెందారు. గుర్తించే అవకాశం చాలా తక్కువగా ఉన్న ఒకటి రెండు షాట్స్ మినహాయించి ఎలాంటి అదనపు సన్నివేశాలు లేవు.

కొన్ని ఇంటర్వ్యూలలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ నెట్ ఫ్లిక్స్ కోసం ప్రత్యేకంగా ఎడిట్ చేస్తున్నానని, అవి ప్రేక్షకులను మరింత సర్ప్రైజ్ చేస్తాయని చెప్పాడు. దీని కోసమే యాంగ్జైటి పెంచుకున్న వాళ్ళు ఎందరో. రష్మిక మందన్న, త్రిప్తి డిమ్రిలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సీన్లు ఉంటాయని ప్రచారం జరిగింది. క్యారెక్టర్లకు సంబంధించిన కొన్ని కన్ఫ్యూజన్ లు దీని ద్వారా తీరతాయని కూడా ఆశించారు. తీరా చూస్తే మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాలు మనం ఏదైతే బిగ్ స్క్రీన్ మీద చూశామో అదే క్షణం మారకుండా చిన్నితెరపై ప్రత్యక్షమయ్యింది.

ఇలా ఎందుకు జరిగిందనే కారణాలు విశ్లేషిస్తే ఇండియాలో సెన్సార్ చేసిన కంటెంట్ నే స్ట్రీమింగ్ చేయాలని నెట్ ఫ్లిక్స్ నిర్ణయించుకోవడం వల్లేనని అంటున్నారు. ఆ మధ్య షారుఖ్ ఖాన్ జవాన్ కూడా ఇదే తరహాలో పబ్లిసిటీ ఇచ్చి ఫైనల్ గా తూచ్ అన్నారు. ఇప్పుడు యానిమల్ కు అదే జరిగింది. ఊరికే ఉంటే పోయదానికి ఎందుకిలా ఎక్స్ ట్రా ఫుటేజ్ ప్రచారాలు చేస్తున్నారని మూవీ లవర్స్ నిలదీస్తున్నారు. చూస్తుంటే ఇకపై ఓటిటిలో సినిమా మొత్తం చూశాక తప్ప ఎవరినీ నమ్మలేమేమో. దీని సంగతి ఎలా ఉన్నా నెట్ ఫ్లిక్స్ చరిత్రలో భారీ వ్యూస్ తెచ్చే సినిమాగా యానిమల్ నిలవొచ్చని ఒక అంచనా.