దేవర మెడపై రెండు కత్తులు

ఏప్రిల్ 5 విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని టీమ్ అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చిన రెండు రోజుల్లోనే మొత్తం సీన్ మారిపోయేలా కనిపిస్తోంది. దీని షూటింగ్ కోసమే హైదరాబాద్ వచ్చిన సైఫ్ అలీ ఖాన్ హఠాత్తుగా స్వల్ప ప్రమాదానికి గురి కావడం, హాస్పిటల్ లో చేరితే చిన్న సర్జరీ అవసరం పడటంతో చిత్రీకరణకు బ్రేక్ వేయాల్సి వచ్చింది. తను వస్తున్న కారణంగానే జూనియర్ ఎన్టీఆర్ అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి వెళ్లలేకపోయాడు. తీరా సైఫ్ బ్రేక్ ఇచ్చినా అప్పటికప్పుడు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో మిన్నకుండిపోయాడు. ఈలోగా ఏవేవో ప్రచారాలు జరిగిపోయాయి.

ఇప్పుడు దేవర మెడపై రెండు కత్తులు వేలాడుతున్నాయి. ఒకటి సైఫ్ వీలైనంత త్వరగా కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావడం. ఫలానా రోజని డాక్టర్లు చెప్పలేకపోతున్నారట. మరీ తీవ్రమైన గాయం కాకపోయినా విశ్రాంతి డిమాండ్ చేసే ఆపరేషన్ కావడంతో ఇంకో రెండు మూడు రోజుల తర్వాత దీని గురించి స్పష్టత రావొచ్చు. ఇంకోవైపు అనిరుద్ రవిచందర్ పాటల పంచాయితీ తేలలేదు. రిలీజ్ కు ఇంకో డెబ్భై రోజుల కంటే తక్కువ సమయం ఉండటంతో టీమ్ మీద చాలా ఒత్తిడి ఉంది. మొదటి ఆడియో సింగల్ ని మార్కెట్ లో ఎప్పుడు వదలాలో చెప్పమని ఆడియో కంపెనీ నుంచి ప్రెజర్ ఉందట.

అసలు అనిరుద్ ఎన్ని ట్యూన్స్ ఇచ్చాడో గుట్టుగా ఉంచుతున్నారు. వీటి షూటింగ్ పెండింగ్ ఉంది. ఏదో ఆషామాషీగా హడావిడి పడేందుకు ఇది కమర్షియల్ సినిమా కాదు. ప్యాన్ ఇండియా మూవీ. అంచనాల బరువు మాములుగా లేదు. దర్శకుడు కొరటాల శివ ఈ పనులన్నీ చూసుకుంటూ మ్యూజిక్ కోసం పదే పదే చెన్నై వెళ్లే పరిస్థితిలో లేడు. అనిరుద్ హైదరాబాద్ వస్తేనే పని వేగమవుతుంది. పైగా రీ రికార్డింగ్ కి ఎక్కువ సమయం ఇవ్వాలి. ఇవన్నీ చూసుకుంటే సుదీర్ఘమైన సెలవులు కలిసి వచ్చే ఏప్రిల్ 5 మిస్ అవుతామేమోననే టెన్షన్ తారక్ ఫ్యాన్స్ లో మొదలైంది. దేవర టీమ్ ఏం చేస్తుందో మరి.