ఆదిపురుష్ గాయం ‘హనుమాన్’తో మాయం

కొన్ని బాక్సాఫీస్ విచిత్రాలు కాకతాళీయమైనా సరే భలే అనిపిస్తాయి. అలాంటిదే ఇది. గత ఏడాది ఆదిపురుష్ ని నైజామ్ లో మైత్రి సంస్థ పంపిణి చేసింది. భారీ అంచనాలు ఉండటంతో పాటు ప్రభాస్ ఇమేజ్, రామాయణం సెంటిమెంట్ కనకవర్షం కురిపిస్తాయని నమ్మి పోటీకి వెళ్లి మరీ హక్కులు కొన్నారు. ఒకదశ వరకు దిల్ రాజు రేస్ లో ఉండి తర్వాత రేటు చూసి డ్రాపయ్యారు. తీరా చూస్తే అంత ప్యాన్ ఇండియా మూవీ ఫ్లాప్ కావడం దెబ్బ కొట్టింది. ఓపెనింగ్స్ గ్రాండ్ గా వచ్చినా టాక్ వాటిని నిలబెట్టలేదు. ఫలితంగా ఒక్క ఆ ఏరియా నుంచే పన్నెండు కోట్లకు పైగా నష్టం వచ్చిందని ట్రేడ్ టాక్.

ఇప్పుడది మైత్రికి పూర్తిగా తీరిపోయింది.హనుమాన్ టికెట్ కౌంటర్లు లాభాల సునామిలో మునిగి తేలడంతో మైత్రి మేకర్స్ జాక్ పాట్ కొట్టారు. విడుదల రోజు డిస్ట్రిబ్యూషన్ పరంగా హనుమాన్ ఎన్ని ఇబ్బందులు పడిందో చూశాం. ఫస్ట్ డే హైదరాబాద్ మొత్తం నాలుగు సింగల్ స్క్రీన్లు ఇచ్చారు. మల్టీప్లెక్సుల షోలు అధికంగా గుంటూరు కారంకు వెళ్లాయి. ఏషియన్ ఫిలింస్ తో తలెత్తిన సమస్య వల్ల సకాలంలో వాళ్ళ థియేటర్లు ఇవ్వలేకపోయినా తర్వాత సద్దుమణిగింది. రివర్స్ లో తేజ సజ్జ కౌంట్ పెరిగి మహేష్ బాబువి తగ్గడం మొదలయ్యాయి. దీంతో హనుమాన్ బంగారు గుడ్లు పెట్టే బాతుగా మారిపోయింది.

కొన్న ప్రతిఒక్కరికి రూపాయికి కనీసం అయిదు రూపాయల లాభం ఇచ్చే దిశగా హనుమాన్ దూసుకుపోతోంది. సుమారు ఏడు కోట్లకు కొంచెం అటు ఇటుగా నైజామ్ థియేట్రికల్ రైట్స్ అమ్మితే పది రోజులకే షేర్ ఇరవై ఆరు కోట్లు దాటడం మాములు సంచలనం కాదు. ఇంకా ఫైనల్ రన్ అవ్వలేదు. ఫిబ్రవరి తొమ్మిది దాకా నెమ్మదించడం కష్టమేనని బయ్యర్ల మాట. దీనికి ధీటుగా కంటెంట్ ఉన్న కొత్త రిలీజ్ ఏవీ అప్పటిదాకా లేకపోవడం ప్లస్ అవుతోంది. ట్విస్ట్ ఏంటంటే తెలుగు రాష్ట్రాల మొత్తం బిజినెస్ ఒక నైజామ్ లోనే వసూలు కావడం. హనుమాన్ దెబ్బా మజాకాని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.