అప్పుడు వాళ్లు.. ఇప్పుడు వెంకీ

తెలుగు సినిమాలు సంబంధించి క్రేజీయెస్ట్ సీజన్ అంటే సంక్రాంతినే అనడంలో మరో మాట లేదు. రిలీజ్ అయ్యే సినిమాలకు మంచి టాక్ వస్తే మామూలుగా వచ్చేదాంతో పోలిస్తే 20 30 శాతం అదనపు వసూళ్లు వస్తాయి. అలవైకుంఠ పురములో, వాల్తేరు వీరయ్య లాంటి చిత్రాలు వాటి స్థాయిని మించి వసూళ్ల మోత మోగించాయంటే అందుకు కారణం సంక్రాంతికి రిలీజ్ కావడమే.

అందుకే ఈ పండక్కి సినిమాలను రిలీజ్ చేయడానికి నిర్మాతలు పోటీ పడతారు. చాలా ముందు నుంచే బెర్తులు బుక్ చేసుకుంటారు. అయితే సంక్రాంతికి హిట్ టాక్ వస్తే అదనపు వసూళ్లు రావడం నిజమే కానీ.. ఈ టైంలో పోటీ ఎక్కువ ఉంటే థియేటర్లు ఆశించిన స్థాయిలో దక్కవు. దీనికి తోడు టాక్ తేడా కొట్టిందంటే దారుణంగా దెబ్బతింటుందా సినిమా.

సంక్రాంతి మీద భారీ ఆశలతో రిలీజ్ అయ్యి దారుణంగా దెబ్బతిన్న సినిమాలు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. ఓపెనింగ్స్ వరకు ఓ మోస్తరుగా రాబట్టి.. పోటీలో ఉన్న మిగతా సినిమాలో దూకుడు ముందు వెలవెలబోయి అడ్రస్ లేకుండా పోయాయి ఆ చిత్రాలు. గత కొన్నేళ్ళలో పరిస్థితి గమనిస్తే.. ఎన్టీఆర్ కథానాయకుడు, అజ్ఞాతవాసి, ఎంత మంచి వాడవురా లాంటి సినిమాలు ఇందుకు ఉదాహరణ. ఇక ఈ ఏడాది సైంధవ్ ఈ జాబితాలో చేరేలా కనిపిస్తోంది. సంక్రాంతి సినిమాలన్నింటిలోకి బ్యాడ్ టాక్ తెచ్చుకున్నది ఇదే.

హనుమాన్ బెస్ట్ టాక్ తో ప్రభంజనం సృష్టిస్తుండగా.. గుంటూరు కారం, నా సామిరంగ ఓ మోస్తరుగా ఆడుతున్నాయి. కానీ సైంధవ్ పరిస్థితి దారుణంగా ఉంది. ఈ సినిమా ఏ దశలోనూ పికప్ కాలేదు. ఓపెనింగ్స్ కూడా అంతంత మాత్రమే వచ్చాయి. వేరే సినిమాల ఓవర్ ప్లోస్ తో కొంత వరకు నడిచింది కానీ.. అంతిమంగా సినిమా డిజాస్టర్ అని చెప్పాలి. కాబట్టి క్రేజీ సీజన్ అని సంక్రాంతికి రిలీజ్ చేయడం బాగానే ఉంది కానీ కంటెంట్ విషయంలో కొంచెం ముందు వెనక చూసుకుంటే బెటర్.