రాజమౌళికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్: కీరవాణి

ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అయి దాటిపోయింది. దీని తర్వాత రాజమౌళి చేయబోతున్న సినిమా మహేష్ తోనే అన్నది తెలిసిన సంగతే. అయితే ఆ సినిమా ఎప్పుడు సెట్స్ మీదికి వెళ్తుంది అన్న క్లారిటీ లేదు. దీని గురించి టీమంతా మౌనం వహిస్తోంది. మీడియాకు కూడా చిక్కడం లేదు. అయితే రాజమౌళి ఆస్థాన సంగీత దర్శకుడు అయిన కీరవాణి.. తన కొత్త చిత్రం నా సామి రంగ సంక్రాంతికి విడుదలవుతున్న నేపథ్యంలో మీడియాను కలిశారు.

ఈ సందర్భంగా ఆయనకు రాజమౌళి మహేష్ సినిమా గురించి ప్రశ్నలు మీడియా నుంచి ఎదురయ్యాయి. దానికి ఆయన తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకున్నారు. ఈ సినిమా గురించి అడిగేందుకు రాజమౌళికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తోందని ఆయన చమత్కరించారు. అంటే ఈ చిత్రానికి సంబంధించి తన పని ఇంకా మొదలుకాలేదు అని అర్థమని ఆయన అన్నారు.

ఇక తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి చెబుతూ.. చిరంజీవి సినిమా (విశ్వంభర) పని నడుస్తోందని.. హరిహర వీరమల్లుకు సంబంధించి మూడు పాటలు పూర్తయ్యాక బ్రేక్ వచ్చిందని.. మళ్లీ క్రిష్ అడిగినప్పుడు ఈ సినిమా పని మొదలు పెడతానని కీరవాణి చెప్పారు. నా సామి రంగ కు సంబంధించి మ్యూజికల్ ఔట్ పుట్ విషయంలో సంతృప్తిగా ఉన్నానని తాను చేసిన నాగార్జునతో చేసిన ప్రెసిడెంట్ గారి పెళ్ళాం వైబ్ ఈ మూవీలో కనిపించిందని.. ఆ సినిమాలాగే ఇది కూడా హిట్ అవుతుందని కీరవాణి ధీమా వ్యక్తం చేశారు. సంగీత పరంగా ఈ మధ్యకాలంలో తనకు నచ్చిన సినిమాల గురించి చెబుతూ.. జైలర్ లో అనిరుధ్ వర్క్ బాగా నచ్చి అతనికి మెసేజ్ కూడా పెట్టానని.. అలాగే యానిమల్ సినిమా మ్యూజిక్ కూడా తనకు ఎంతో నచ్చిందనీ కీరవాణి తెలిపారు