ఎప్పుడూ చూడని దిల్ రాజు ఆగ్రహం

మాములుగా ఎలాంటి సందర్భంలో అయినా సరే కూల్ గా కనిపించే దిల్ రాజు ఈ రోజు ఎమోషనల్ కావడంతో పాటు బాగా ఆగ్రహించేశారు. ఒక చిన్న సినిమా ఈవెంట్ కొచ్చిన సందర్భంగా గత ఏడెనిమిదేళ్లుగా తనను టార్గెట్ చేసుకుని కొన్ని సోషల్ మీడియా వర్గాలు, వెబ్ సైట్స్, యూట్యూబ్ ఛానల్స్ లో ఉద్దేశపూర్వకంగా బురద జల్లుతున్నారని, ఇకపై ఉపేక్షించేది లేదని చెబుతూ తాట తీస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడా వీడియో విపరీతంగా వైరలవుతోంది . ఎవరిని ఉద్దేశించో పేర్లు చెప్పకపోయినా ఇంత భావోద్వేగంగా దిల్ రాజును ఎప్పుడు చూడలేదని దగ్గరి వాళ్ళు ఆశ్చర్యంతో చూశారు.

ప్రతి సంక్రాంతికి దిల్ రాజునే ఏదో తప్పులు చేస్తునట్టు ప్రోజెక్ట్ చేయడం సరికాదని, ఇండస్ట్రీలో తొంభై అయిదు శాతం మందికి నచ్చాను కాబట్టి ఇవాళ ఇంత గౌరవంతో ఈ స్థితిలో ఉన్నానని, అందరికీ సంతృప్తి పర్చడం ఎవరి వల్ల కాదని అన్నారు. అంతే కాదు హనుమాన్ ని నేనేదో ఆపుతున్నట్టు అంటున్నారు కానీ నా సామిరంగ, సైంధవ్ లకు సైతం కొన్ని చోట్ల థియేటర్లు దొరకని విషయాన్ని ఎవరు ప్రశ్నిస్తున్నారని నిలదీశారు. అంతేకాదు హనుమాన్ ఫంక్షన్ లో చిరంజీవి తన గురించి అంత గొప్పగా చెబితే వాటికి విచిత్ర భాష్యాలు తీశారని వేదికపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ పరిణామం అందరిని షాక్ కి గురి చేసింది. గుంటూరు కారం విడుదల, కొన్ని ఏరియాల్లో మిగిలిన సినిమాల డిస్ట్రిబ్యూషన్, గేమ్ ఛేంజర్ షూటింగ్ కొనసాగింపు, ఫ్యామిలీ స్టార్ ప్రొడక్షన్, ఆశిష్ చిత్రం తాలూకు వర్క్ ఇలా బోలెడు పనుల్లో తలమునకలైన దిల్ రాజు ఇంతకన్నా ఒత్తిడిని ఎన్నో సందర్భాల్లో చూశారు. గత ఏడాది వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డితో పాటు వారసుడుని రిలీజ్ చేయడం మీద ట్విట్టర్ లో పెద్ద చర్చే జరిగింది. ఇలాంటివి చూసి చూసి చివరికి ఓపిక నశించి దిల్ రాజు ఫైర్ అయినట్టున్నారు. నవ్వుతూ శాంతంగా కనిపించే రాజుగారి కోపరూపాన్ని ఇవాళ దగ్గరి నుంచి చూపించారు.