ధనుష్ డబ్బింగ్ సినిమాని నిలువరించగలరా

సంక్రాంతికి టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలకే తలనెప్పిగా ఉంటే ఇంకా డబ్బింగ్ వాటి గురించి అడుగుతారేంటని ఇటీవలే నిర్మాత దిల్ రాజు ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం గుర్తే. అయితే ధనుష్ కెప్టెన్ మిల్లర్ రేస్ లోకి రావడం ఆసక్తి రేపుతోంది. గుంటూరు కారం, హనుమాన్ వస్తున్న జనవరి 12నే రిలీజ్ చేయబోతున్నట్టు యూనిట్ అధికారికంగా పోస్టర్ తో పాటు ప్రకటించింది. కోలీవుడ్ కి సైతం పొంగల్ చాలా కీలకమైన పండగ కావడంతో స్టార్ హీరోలు ఈ సీజన్ ని మిస్ చేసుకోవడానికి ఇష్టపడరు. పైగా రజినీకాంత్ లాల్ సలామ్ తప్పుకోవడంతో అల్లుడు ధనుష్ కి రూటు క్లియరయిపోయింది.

ఇప్పుడు అసలు సమస్య మరొకటుంది. నిజంగా తెలుగు రాష్ట్రాల్లో కెప్టెన్ మిల్లర్ ని నిలువరించేలా మన నిర్మాతల సమాఖ్య చొరవ తీసుకుంటారా అనేదే భేతాళ ప్రశ్న. ఎందుకంటే ఎవరో ఒకరు హక్కులు కొంటారు. బ్యాకప్ గా పేరున్న డిస్ట్రిబ్యూటర్లు ముందుకొస్తారు. దాంతో సహజంగానే ఎన్నో కొన్ని థియేటర్లు ధనుష్ బొమ్మకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఎన్నో సార్లు వచ్చిన చిక్కే. గతంలో పేట ప్రొడ్యూసర్లు మీడియాకెక్కి మరీ రచ్చ చేశారు. ఈ సంవత్సరం వారసుడుని తెచ్చినందుకు దిల్ రాజు సైతం టార్గెట్ అయ్యారు. ఇప్పుడు కెప్టెన్ మిల్లర్ ని ఎలా అడ్డుకోగలరు.

క్రేజ్ పరంగా గుంటూరు కారం, హనుమాన్ లతో ధనుష్ కి పోలిక లేకపోవచ్చు. కానీ ఏపీ తెలంగాణ కలిపి కనీసం ఒక వంద స్క్రీన్లు ఇచ్చినా ఆ మేరకు మహేష్, వెంకీ, నాగార్జున, రవితేజ, తేజ సజ్జలు ఆ కౌంట్ ని కోల్పోయినట్టే. స్టోరీ ఇక్కడితో అయిపోలేదు. శివ కార్తికేయన్ అయలన్ కూడా వస్తోంది. డబ్బింగ్ కార్యక్రమాలు గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతున్నాయి. ఇతనూ రెండు భాషల్లో ఒకేసారి రిలీజ్ కోరుకుంటాడు. మనం ఇంతగా తలలు పగలగొట్టుకుంటున్నాం కానీ అదే తమిళనాడులో మన సంక్రాంతి సినిమాలకు సింగల్ డిజిట్ థియేటర్లు ఇచ్చినా గొప్పే అనుకోవాలి.