యానిమల్ వెయ్యి కోట్లకు బ్రేకులు పడ్డాయా

ఈ నెల ఒకటిన విడుదలై బాక్సాఫీస్ వద్ద విరుచుకుపడిన యానిమల్ నాలుగో వారంలో అడుగు పెట్టాక తొమ్మిది వందల కోట్లకు దగ్గరగా ఉంది. వెయ్యి లక్ష్యాన్ని చేరుకుంటుందనే అంచనాలు బలంగా ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా సలార్ ఎంట్రీ మొత్తం సీన్ నే మార్చేసింది. తెలుగు రాష్ట్రాలను పూర్తిగా కమ్మేయగా, కేరళ కర్ణాటకలో మంచి పికప్ చూపిస్తోంది. తమిళనాడులో మాత్రం ఆశించిన స్థాయిలో జోరు లేదు. డంకీ వల్ల స్క్రీన్లు సరిగా దొరక్కపోవడంతో నార్త్ ఇండియాలో ఇంకా ఊపందుకోవాల్సి ఉంది. డంకీ ఆక్యుపెన్సీలు పెద్దగా లేవని తమకు సలారే కావాలని సింగల్ థియేటర్ల యజమానులు డిమాండ్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా యానిమల్ ఇంకో వంద కోట్లను పోగేసుకుంటే సహస్రం తోడవుతుంది. అయితే అసాధ్యం అయితే కాదు. ఎందుకంటే సలార్ హిట్ టాక్ వచ్చినప్పటికీ ఉత్తరాదిలో మరీ బాహుబలి రేంజ్ లో ఆడకపోవచ్చనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒకవేళ డంనీ రీ ప్లేస్ చేయాలనుకుంటే మొదటి ప్రాధాన్యం దానికి ఇచ్చి ఒకవేళ వద్దనుకుంటే బెస్ట్ ఆప్షన్ గా బయ్యర్లు యానిమల్ నే ఎంచుకుంటున్నారు. క్రిస్మస్ నుంచి కొత్త సంవత్సరం ఆరంభం వరకు చెప్పుకోదగ్గ సెలవులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆ మైలురాయి అందుకోవచ్చనే విశ్లేషణలు జోరుగా ఉన్నాయి.

ఇది జరిగినా జరగకపోయినా సందీప్ రెడ్డి వంగా అందుకున్న ఘనత మాత్రం చిన్నది కాదు. కేవలం మూడో సినిమాకే ఇంత పెద్ద ఫీట్ అందుకోవడం పట్ల తలలు పండిన హిందీ సినీ పండితులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు దీని దెబ్బకే యానిమల్ పార్క్ డిమాండ్ పెరిగిపోయింది. ప్రభాస్ స్పిరిట్ కన్నా ముందు దీన్ని తీయాలని మూవీ లవర్స్ కోరుతున్నారు. కానీ ఇది సందీప్ చేతిలో లేదు. టి సిరీస్ తో చేతులు కలిపిన ఈ క్రియేటివ్ జీనియస్ మొత్తం మూడు ప్యాన్ ఇండియా ప్రాజెక్టులను లాక్ చేసుకున్నారు. వాటిలో అల్లు అర్జున్ తో ప్లాన్ చేసుకున్నది చివర్లో ఉంటుంది .