పవన్ ఆపితే వరుణ్ పరిగెత్తిస్తున్నాడు

జనసేన కార్యకలాపాల కోసం పవన్ కళ్యాణ్ మొత్తం షూటింగులను ఆపేసి బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే. రాబోయే మూడు నెలలు చాలా కీలకం కావడంతో సెట్ల మీద కన్నా ప్రజా క్షేత్రంలో ఉండటం అవసరమని గుర్తించి ఆ మేరకు దర్శక నిర్మాతలకు స్పష్టంగా సమాచారమిచ్చాడు. వాటిలో ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది. తమిళ బ్లాక్ బస్టర్ తేరికి కీలక మార్పులు చేసి దర్శకుడు హరీష్ శంకర్ రూపొందిస్తున్న ఈ పోలీస్ డ్రామా అనుకున్న టైంకి పూర్తయ్యి ఉంటే 2024 ఫిబ్రవరి రేసులో ఉండేది. కానీ వచ్చే ఏడాది ఏ దసరాకో దీపావళికో ఇప్పుడే చెప్పడం కష్టం.

అటువైపు బాలీవుడ్ లో ఇదే తేరి రీమేక్ వేగమందుకుంది. వరుణ్ ధావన్ టైటిల్ రోల్ పోషిస్తుండగా ఒరిజినల్ వెర్షన్ డైరెక్ట్ చేసిన అట్లీ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అతని స్నేహితుడు కలీస్ కి డైరెక్షన్ బాధ్యతలు అప్పజెప్పాడు. ఇందులో ప్రధాన ఆకర్షణ ఏంటంటే హీరోయిన్ గా కీర్తి సురేష్ చేయడం. ఇప్పటికే షూట్ మొదలైపోయింది. మెయిన్ విలన్ గా జాకీ శ్రోఫ్ ని ఎంపిక చేసినట్టు ముంబై అప్ డేట్. ఎక్కువ ఎంటర్టైనర్లలో నటించే వరుణ్ ధావన్ ఇంత సీరియస్ కథలో ఎలా కనిపిస్తాడనే ఆసక్తి ప్రేక్షకుల్లో లేకపోలేదు. అయితే అంచనాలకు మించే పెర్ఫార్మ్ చేస్తున్నాడట.

ఇప్పుడు జరుగుతున్న స్పీడ్ ప్రకారం హిందీ తేరిని మేలో విడుదల చేసేలా ప్లానింగ్ జరుగుతుంది. అంటే పవన్ కళ్యాణ్ కన్నా ముందు అదే కథతో వరుణ్ ధావన్ వచ్చేస్తాడు. ట్రీట్ మెంట్ పరంగా హరీష్ శంకర్ నుంచి పూర్తి వైవిధ్యాన్ని ఆశించవచ్చు కాబట్టి టెన్షన్ అక్కర్లేదు కానీ ఎటొచ్చి మెయిన్ పాయింట్ అయితే అదే ఉంటుంది. విజయ్ తో తీసిన తేరి తర్వాత అట్లీ జాతకం మారిపోయింది. కమర్షియల్ బ్లాక్ బస్టర్లతో ఏకంగా షారుఖ్ ఖాన్ దాకా వెళ్ళిపోయాడు. జవాన్ సక్సెస్ చూశాక తనతోనే మరో మూవీ చేసేందుకు బాద్షా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. విజయ్ కూడా ఉండొచ్చట.