మత్తు వదలరా 2 మరింత వేగంగా

2019లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన మత్తు వదలరా అనూహ్యంగా స్లీపర్ హిట్ కావడం ట్రేడ్ ని సైతం ఆశ్చర్యపరిచింది. స్టార్లే లేకుండా కొత్త కుర్రాళ్లతో దర్శకుడు రితేష్ రానా చేసిన థ్రిల్లింగ్ ప్రయోగం మంచి ఫలితాన్ని ఇచ్చింది. కీరవాణి గారబ్బాయి శ్రీసింహ కోడూరికి డెబ్యూనే సూపర్ హిట్ దక్కింది. విచిత్రంగా ఆ తర్వాత హీరోకు, దర్శకుడికి ఇద్దరికీ సరైన కెరీర్ దక్కలేదు. రితీష్ ని నమ్మి మైత్రి మూవీ మేకర్స్ హ్యాపీ బర్త్ డేకి మద్దతు ఇస్తే అదేమో దారుణంగా పోయింది. లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో డిఫరెంట్ గా తీశాడు కానీ జనాలకు అర్థం కాక ఫ్లాప్ చేశారు.

ఇక శ్రీసింహ పరిస్థితి తెలిసిందే. తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, ఉస్తాద్, భాగ్ సాలే ఇలా ఒకదాన్ని మించి మరొకటి ఫ్లాపులు బాట పట్టించాయి. ఇలా లాభం లేదని మత్తు వదలరా 2కి ఈ కాంబో శ్రీకారం చుట్టబోతోంది. స్క్రిప్ట్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఫిబ్రవరిలో షూటింగ్ మొదలుపెట్టి జూన్ కల్లా ఫస్ట్ కాపీ సిద్ధం చేసేలా మొత్తం ప్రణాళిక తయారు చేసుకున్నారని ఇన్ సైడ్ టాక్. అంటే నాలుగు నెలల్లో చిత్రీకరణ అయిపోతుంది. సంగీత దర్శకుడిగా కాల భైరవనే కంటిన్యూ కాబోతున్నాడు. కమెడియన్ సత్య ఇందులోనూ నవ్వులు పూయించడానికి రెడీ అవుతున్నాడు.

వీళ్ళు కాకుండా మరికొంత క్రేజీ క్యాస్టింగ్ కోసం ప్లానింగ్ జరుగుతోందట. కాల్స్ షీట్స్ కన్ఫర్మ్ చేసుకున్నాక ఆర్టిస్టులను ప్రకటిస్తారు. దీనికి కూడా మైత్రినే సపోర్ట్ చేయనుంది. మంచి కంటెంట్ ఉంటే చిన్న సినిమాలకు ఆదరణ దక్కుతున్న నేపథ్యంలో మత్తు వదలరా 2ని పూర్తి ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దుతారని తెలిసింది. కథకు సంబంధించిన లీక్స్ రాలేదు కానీ క్రైమ్, కామెడీ, సస్పెన్స్ ఈ మూడింటిని బ్యాలన్స్ చేసేలా రాసుకున్నారని వినికిడి. 2024 వేసవి రిలీజ్ కు ప్లాన్ చేసుకున్న మత్తు వదలరా 2 శ్రీసింహా, రితీష్ ఇద్దరికీ బ్రేక్ ఇవ్వాల్సిన బాధ్యత తీసుకుంటోంది.