రానా నమ్మకాన్ని తేజ నిలబెట్టుకోవాలి

మాములుగా వరస డిజాస్టర్లు ఇచ్చిన దర్శకులకు అవకాశాలు పుట్టడం కష్టం. ఒకప్పటి ట్రాక్ రికార్డు ఎంత ఘనంగా ఉన్నా ఇప్పుడేంటి అనేదే ప్రస్తుత హీరోల ఆలోచనా ధోరణి. అయినా సరే తేజకు ఇంకా ఆఫర్లు రావడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఇటీవలే దగ్గుబాటి అభిరాంని పరిచయం చేస్తూ తీసిన అహింస ప్రేక్షకులను ఎంత హింస పెట్టిందో చెప్పనవసరం లేదు. మొన్న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయ్యే దాకా ఇదొకటి వచ్చిందన్న సంగతే కామన్ ఆడియన్స్ కి తెలియనంత వేగంగా థియేటర్లలో వచ్చి వెళ్ళింది. అంతకు ముందు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సీత కూడా ఇదే ఫలితం.

ఇంత జరిగినా రానాకు మాత్రం తేజ మీద గురి తగ్గలేదు. తాజాగా రాక్షస రాజాని ప్రకటించారు. ఇదెప్పుడో ఓ ఫంక్షన్ లో తేజ స్టేజి మీద అనౌన్స్ చేశాడు కానీ కార్యరూపం దాల్చడానికి నెలలు పట్టింది. రానా ఇంత స్పెషల్ ఇంటరెస్ట్ చూపించడానికి కారణం ఒకటే. బాహుబలి తర్వాత సోలోగా తనకు సరైన హిట్టు లేని టైంలో నేనే రాజు నేనా మంత్రితో మంచి విజయం అందించాడు. తనలో మరో పెర్ఫార్మర్ ని బయటికి తీశాడు. ఆ కృతజ్ఞతే కాబోలు రానా, సురేష్ బాబులను మళ్ళీ ఇంకో ఆఫర్ ఇచ్చేలా చేసింది. హీరోయిన్, ఇతర టీమ్ కు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

ఒకరకంగా ఇది తేజకు డూ ఆర్ డై లాంటిది. చావో రేవో తేల్చుకోవాల్సిందే. ఒకేరకమైన ప్రేమకథలుతో మూసధోరణికి అలవాటు పడ్డ ఈ విలక్షణ దర్శకుడు పొలిటికల్ సబ్జెక్టుని బాగా హ్యాండిల్ చేయగలనని నేనే రాజు నేనే మంత్రితో రుజువు చేశారు. మళ్ళీ ఇప్పుడీ రాక్షస రాజాతో రానా నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఇక రానా సైతం కెరీర్ మీద సీరియస్ గా దృష్టి పెట్టాలి. చిరంజీవి విశ్వంభరలో విలన్ గా చేయబోతున్న సంగతి ఆల్రెడీ లీకైపోయింది. రెండు రకాలుగా బ్యాలన్స్ చేస్తూ వరసగా సినిమాలు చేస్తూ ఉంటే మరిన్ని ఛాలెంజింగ్ పాత్రలు దక్కుతాయి.