మృణాల్ ఠాకూర్ నిదానమే ప్రధానం

మాములుగా ఏ బాషా పరిశ్రమలో అయినా ఒక బ్లాక్ బస్టర్ తో హీరోయిన్ కి డెబ్యూ దక్కాక ఆఫర్ల వర్షం కురుస్తుంది. దానికి తగ్గట్టే దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకునే సూత్రంతో వేగంగా ఒప్పుకోవడం చూస్తుంటాం. అలా తొందపడినవాళ్లకు ఎదురు దెబ్బలు కూడా అంతే స్పీడ్ గా తగులుతాయి. కృతి శెట్టి, శ్రీలీల కన్నా ఉదాహరణలు అక్కర్లేదు. ఉప్పెన భామ ఆల్రెడీ కనిపించకుండా పోయింది. శర్వానంద్ సినిమా తప్ప చేతిలో ఇంకే టాలీవుడ్ ఛాన్సులు లేవు. శ్రీలీలకు భగవంత్ కేసరి మినహాయిస్తే వరసగా హ్యాట్రిక్ డిజాస్టర్లు పడ్డాయి. ఇప్పుడు తన ఆశలన్నీ గుంటూరు కారం మీదే.

వీళ్లకు భిన్నంగా మృణాల్ ఠాకూర్ చాలా నెమ్మదిగా నిదానమే ప్రధానం సూత్రం పాటించడం టాలీవుడ్ లో మంచి ఫిల్మోగ్రఫీని తెచ్చి పెడుతోంది. డెబ్యూ సీతారామం వచ్చి ఏడాది దాటినా తొందరపడకుండా ఆచితూచి అడుగులు వేస్తోంది. హిందీలో స్కిన్ షో చేస్తున్నా ఇక్కడ మాత్రం పెర్ఫార్మన్స్ కు అవకాశం ఉన్న వాటికే ఓటేస్తోంది. అందుకే పాప తల్లిగా నటించాల్సి వచ్చినా హాయ్ నాన్నకు వెనుకాడలేదు. నెక్స్ట్ ఫ్యామిలీ స్టార్ మీద కూడా మంచి అంచనాలున్నాయి. రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబో అందులోనూ పరశురామ్ దాన్ని క్లీన్ ఎంటర్ టైనర్ గా తీస్తున్నాడు.

ఇవి కాకుండా చిరంజీవి విశ్వంభరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే టాక్ ఉంది అదెంత వరకు నిజమో తెలియాల్సి ఉంది. త్రిష ఆల్రెడీ కన్ఫర్మ్ కాగా మొత్తం అయిదుగురు బ్యూటీల కోసం దర్శకుడు వశిష్ట ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇంకో రెండు మూడు చర్చల దశలో ఉన్నాయి కానీ అధికారిక ప్రకటన వచ్చాకే క్లారిటీ వస్తుంది. ఇండస్ట్రీలో హీరోయిన్ల కొరత ఉన్న నేపథ్యంలో మృణాల్ ఒకలాంటి ప్లానింగ్ తో ముందుకెళ్తుంటే శ్రీలీల ఇంకోరకమైన వేగంతో పరుగులు పెడుతోంది. ఫైనల్ గా కుదురుకునేది ఎక్కువ సక్సెస్ లు చూసినవాళ్ళే కాబట్టి రాబోయే కొన్నేళ్లు వీళ్లకు చాలా కీలకం కానున్నాయి