కోర్టు మొట్టికాయలు తిన్న మన్సూర్

తాను చేసిందే తప్పయితే రివర్స్ లో అది తప్పన్న వాళ్ళను కోర్టుకీడ్చి లాభపడాలనుకున్న లియో నటుడు కం సీనియర్ విలన్ మన్సూర్ అలీ ఖాన్ కు మద్రాస్ హైకోర్టు మొట్టికాయలు వేసింది. త్రిష మీద అసభ్యంగా మాట్లాడి దానికి పశ్చాత్తాప పడాల్సింది పోయి ఇలా న్యాయస్థానంకు రావడం పట్ల జడ్జ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేయడం హాట్ టాపిక్ గా మారింది. నిజానికి త్రిషనే కేసు వేయాలని, కావాలని వివాదం కొని తెచ్చుకుని ఏదో మంచివాడినని రుజువు చేసుకోవడం కోసం తాపత్రయపడటం ఎంత మాత్రం సరి కాదని వ్యాఖ్యానించింది. ఇక్కడితో అయిపోలేదు.

మన్సూర్ అలీ ఖాన్ తరఫున లాయర్ పూర్తిగా తన క్లయింట్ మాట్లాడిన వీడియోని పరిశీలించాలని అప్పుడే వాస్తవాలు అవగతమవుతానని వివిపించాడు. పరువు నష్టం దావాలో పొందుపరించిన చిరంజీవి, త్రిష, ఖుష్బూ తరఫున రాతపూర్వక వివరణ కోరుతూ డిసెంబర్ 22కి వాయిదా వేసింది. అంటే ఈ ముగ్గురు కోర్టుకు ప్రత్యక్షంగా రాకపోయినా న్యాయవాది ద్వారా తమ వైపు నుంచి అభ్యంతరాలను వ్యక్తం చేయొచ్చు. ఒకవేళ ఇదంతా చేసినందుకు కోపం వచ్చి ఎవరు ఫ్రెష్ గా కేసు పెట్టినా మన్సూర్ అలీ ఖాన్ ఖచ్చితంగా ఇరుక్కుంటాడు. ఈ కేసు నుంచి పాతిక లక్షలకు పైగానే లాగాలని స్కెచ్ వేసుకున్నాడు.

ఇంత జరిగినా నడిగర్ సంఘం నుంచి మన్సూర్ మీద ఎలాంటి చర్యలు లేకపోవడం గమనార్హం. ఎందరో సెలెబ్రిటీలు అతని వ్యాఖ్యల్ని ఖండించి బహిష్కరించమని కోరినా సరే ప్రస్తుతానికి కదలిక లేదు. కొన్ని పెద్ద సినిమాల్లో కీలక పాత్రలు చేస్తుండటంతో ఇప్పటికిప్పుడు ఎలాంటి యాక్షన్ తీసుకోలేమని, ఒకవేళ అలా చేస్తే నిర్మాతలు చాలా నష్టపోతారని, మళ్ళీ కొత్త ఆర్టిస్టులతో రీ షూట్ చేయలేరని చెప్పడం అసలు ట్విస్ట్. ఇలా కాకుండా భవిష్యత్తులో మన్సూర్ లాంటి వాళ్లకు ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా ప్రొడ్యూసర్లు నిర్ణయించుకుంటే సరిపోతుందని అంటున్నారు.