ప్యాన్ ఇండియా వద్దనుకున్న డంకీ

పఠాన్, జవాన్ రెండు వెయ్యి కోట్ల సినిమాలు. అవి అంత పెద్ద బ్లాక్ బస్టర్ అవుతాయని తెలియక ముందే తెలుగుతో సహా ప్రధాన ప్రాంతీయ భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేశారు. రీజనల్ లాంగ్వేజెస్ లోనూ అవి గొప్ప విజయం సాధించాయి. టైగర్ 3 సైతం క్వాలిటీ అనువాదంతో మన ముందుకు వచ్చిందే. కానీ డంకీని కేవలం హిందీకే పరిమితం చేయడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీజర్ నుంచి మొన్న వచ్చిన ట్రైలర్ దాకా ఎక్కడా డబ్ చేస్తున్న సూచనలు ఇవ్వలేదు. సో కేవలం ఒక్క భాషలోనే డంకీ వస్తుందనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది.

ఎందుకని లోతుగా తవ్వితే పలు ఆసక్తికరమైన సంగతులు తెలుస్తున్నాయి. దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ డంకీ అన్ని రాష్ట్రాలకు కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్ కాదని, ఎంత పెద్ద హిట్ అయినా హిందీ ద్వారా మాత్రమే జరగాలని, కేవలం బిజినెస్ కోసం డబ్బింగ్ చేస్తే దాని వల్ల అయ్యే ఖర్చు తప్ప లాభముండదని తేల్చి చెప్పడంతో ఆ నిర్ణయాన్ని షారుఖ్ ఖాన్ ఆయనకే వదిలేశాడట. ఇప్పటిదాకా హిరానీ ఏ చిత్రం ఇతర భాషల్లో రాలేదు. కానీ షారుఖ్ మార్కెట్ లో చాలా మార్పులొచ్చాయి. బిసి సెంటర్లలో జవాన్ కు భారీ స్పందన దక్కింది. ఇప్పుడు అలా లేదంటే డంకీకి మాస్ దూరమవుతారు.

ఇంకో ట్విస్టు ఏంటంటే షారుఖ్ ఎందుకో డంకీ ప్రమోషన్ విషయంలో దూకుడు చూపించడం లేదు. డ్రాప్ 1 2 3 4 అంటూ వరసగా కంటెంట్ అయితే వదులుతున్నారు కానీ మూవీ లవర్స్ లో అంత ఎగ్జైట్ మెంట్ కనిపించడం లేదు. పైగా ఒక్క రోజులోనే వంద మిలియన్ల వ్యూస్ దాటాయని ఘనంగా ప్రచారం చేయడం పట్ల కొన్ని సందేహాలు తలెత్తుతున్నాయి. వీటిని కొనుక్కుని మేనేజ్ చేశారని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా కేవలం హిందీకే డంకీని పరిమితం చేయడం ఖచ్చితంగా సలార్ కు ప్లస్ అయ్యేదే. ఇంకో 17 రోజులు మాత్రమే ఉంది కాబట్టి డంకీ ప్లాన్స్ లో మార్పు ఉండదు.