5 లక్షల టికెట్లంటే మాటలు కాదు

ఇంకొద్ది గంటల్లో థియేటర్లో ప్రత్యక్షం కాబోతున్న యానిమల్ అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే ట్రేడ్ కి నోట మాట రావడం లేదు. బజ్ ఉన్న మాట వాస్తవమే కానీ మరీ ఈ స్థాయిలో ఓపెనింగ్స్ ఊహించలేదని ఒప్పుకుంటున్నారు. ఒక్క పివిఆర్ ఐనాక్స్, సినీపోలీస్ మల్టీప్లెక్స్ చైన్ నుంచే గురువారం మధ్యాన్నంకే 3 లక్షల 25 వేల టికెట్లు అమ్ముడుపోయాయి. సింగల్ స్క్రీన్లు, ప్రైవేట్ యాజమాన్యంలో నడిచే సముదాయాలు కలుపుకుంటే మరో 2 లక్షలు సులభంగా సోల్డ్ అవుట్ అయ్యుంటాని బయ్యర్లు లెక్క కడుతున్నారు. అంటే కనిష్టంగా మొదటి ఆట పడే లోపే అయిదు లక్షల మంది యానిమల్ ని కొనేశారు.

ఈ నెంబర్ ఇవాళ రాత్రికి భారీగా పెరిగే అవకాశముంది. హైదరాబాద్ లో 555 షోలకు గాను 310 షోలు హౌస్ ఫుల్ కు దగ్గరగా ఉన్నాయి. బాలన్స్ కూడా కరెంట్ బుకింగ్ లో నేరుగా కొనేవాళ్ళతో నిండిపోతుంది. జవాన్ ని దాటేసి ఒక్క భాగ్యనగరం నుంచే 3 కోట్ల 20 లక్షల గ్రాస్ దాటేసిన యానిమల్ శనివారం ఉదయంలోపు నాలుగు కోట్లు దాటించినా ఆశ్చర్యం లేదు. బెంగళూరులో ఇదే తరహా ట్రెండ్ కనిపిస్తోంది. చెన్నైలో భారీ వర్షాలు, స్పెషల్ షో అనుమతులు లేని కారణంగా నెమ్మదిగా ఉండగా ముంబై, ఢిల్లీ, కోల్కతా లాంటి నగరాల్లో ఉదయం బెనిఫిట్ షోల సందడి భారీగా ఉండనుంది.

ఓవర్సీస్ లోనూ యానిమల్ దూకుడు ఇదే స్థాయిలో ఉంది. రేపు ఉదయం పదిన్నర ప్రాంతాల్లో వచ్చే టాక్ చాలా కీలకం కానుంది. సోషల్ మీడియా ట్రెండ్స్ మొత్తం దీని మీద నడవబోతున్నాయి. సందీప్ రెడ్డి వంగా, రన్బీర్ కపూర్ లు అంచనాల్లో సగం అందుకున్నా చాలు వసూళ్ల జాతర ఖాయం. ఎంత బ్లాక్ బస్టర్ అయినా చేతిలో ఉన్నది ఇరవై రోజులే. మూడు వారాల తర్వాత డంకీ, సలార్ లు వచ్చేస్తాయి కాబట్టి ఆలోగానే బ్రేక్ ఈవెన్, లాభాలు అన్నీ తీసేసుకోవాలి. అప్పటిదాకా చెప్పుకోదగ్గ కొత్త రిలీజ్ లేకపోవడం, మెర్రీ క్రిస్మస్ లాంటివి డ్రాప్ కావడం యానిమల్ కు కలిసి వచ్చే సానుకూలంశాలు.