మహేష్ హాజరు – ఈవెంట్ బ్లాక్ బస్టరు

నిన్న జరిగిన యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఓ రేంజ్ లో సక్సెస్ అయ్యింది. రెగ్యులర్ గా జరిగే ఫంక్షన్లకు భిన్నంగా చాలా ట్రెండీగా డిజైన్ చేసిన తీరు, వచ్చిన స్టార్లు జోష్ తెప్పించిన వైనం ఫుల్ టైంపాస్ చేయించింది. ఒకదశలో యాంకర్ సుమ సైతం జరుగుతున్నది చూస్తూ ఎంజాయ్ చేయాల్సి వచ్చిందంటే ఏ రేంజ్ లో కిక్ ఇచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యఅతిధిగా రాజమౌళితో పాటు వచ్చిన మహేష్ బాబు చాలా హుషారుగా కనిపించి అభిమానులను లుక్స్ తోనే చంపేశాడు. కూల్ గా క్యాజువల్స్ లో వచ్చిన సూపర్ స్టార్ వేడుక జరుగుతున్నంత సేపు జాలీగా కనిపించాడు.

ఒక బాలీవుడ్ మూవీ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగితే దానికి ఇంత జనం రావడం ఇదే మొదటిసారి. దానికి ప్రధాన కారణం మహేష్ బాబేనని మళ్ళీ చెప్పనక్కర్లేదు. తర్వాతే యానిమల్ బ్రాండ్, రన్బీర్ కపూర్, రష్మిక మందన్న, సందీప్ వంగా వగైరాలు వస్తారు. అనిల్ కపూర్ స్టేజి మీదకు పిలిచి డాన్స్ లో భాగం కమ్మని చెప్పినప్పుడు విపరీతంగా మొహమాట పడ్డ మహేష్ ఎట్టకేలకు స్టేజి ఎక్కి పోకిరిలో డోలే డోలే పాటకు అలా చెయ్యి ఊపి మమ అనిపించాడు. స్పీచ్ లో భాగంగా రన్బీర్ కపూర్ ని గొప్ప స్టార్ గా వర్ణించడం, ట్రైలర్ చూసి మెంటల్ వచ్చిందని ప్రస్తావించడం ఇలా హైప్ ఇచ్చే ప్రసంగంతో ఊపేశాడు.

రన్బీర్ కపూర్, సందీప్ వంగాలకు అత్యంత సన్నిహితుడిగా రాజమౌళి రావడం వల్లే ఆయన అభ్యర్థనతో మహేష్ వచ్చాడనే టాక్ ఉంది కానీ ఇద్దరు హీరోల మధ్య స్నేహం ఒక్కడు నుంచే ఉందనే విషయం నిన్నటితో క్లారిటీ వచ్చింది. బాలీవుడ్ విశ్లేషకులు మాత్రం ఈ స్థాయిలో ఈవెంట్ జరగడం చూసి షాక్ అయ్యారు. ఒకవేళ ఇదే ప్రోగ్రాం ముంబైలో చేసి ఉంటే ఇంత రెస్పాన్స్ వచ్చేది కాదని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి సినిమా రేంజ్ లో కార్యక్రమం బ్లాక్ బస్టర్ కావడం చూసి యూనిట్ ఉబ్బితబ్బిబ్బు అవుతోంది. ఓపెనింగ్స్ మాత్రం ఊహకందేలా లేవు.