ప్ర‌భాస్ సినిమా ఎప్పుడు.. మ‌హేష్‌తో ఎందుకు లేదు?

ప్ర‌భాస్ ఫ్యూచ‌ర్ ప్రాజెక్టుల్లో అత్యంత ఆస‌క్తి రేకెత్తిస్తున్న వాటిలో స్పిరిట్ ఒక‌టి. అర్జున్ రెడ్డితో సంచ‌ల‌నం రేపి.. యానిమ‌ల్‌తో మ‌రింత సెన్సేష‌న్ క్రియేట్ చేసేలా క‌నిపిస్తున్న సందీప్ రెడ్డి వంగ‌తో ప్ర‌భాస్ సినిమా కోసం అభిమానులు ఎంత‌గానో ఎదురు చూస్తున్నారు. రెండేళ్ల కింద‌టే అనౌన్స్ అయిన ఈ సినిమా ఎప్పుడు ప‌ట్టాలెక్కుతుందో క్లారిటీ లేదు.

ప్ర‌భాస్, సందీప్ ఎవ‌రికి వాళ్లు బిజీగా ఉండ‌టంతో ఈ సినిమా ఆల‌స్యం అవుతోంది. ఎట్ట‌కేల‌కు యానిమ‌ల్ మూవీ ఈ డిసెంబ‌రు 1న రిలీజైపోతుండ‌టంతో సందీప్ ఫ్రీ అయిపోతున్నాడు. మ‌రి స్పిరిట్ సినిమాను ఎప్పుడు మొద‌లుపెట్టే విష‌య‌మై అత‌ను ఒక ఇంట‌ర్వ్యూలో మాట్లాడాడు.

ప్రభాస్‌తో తాను చేయ‌బోయే స్పిరిట్ సినిమాకు వ‌చ్చే జూన్ నుండి ప్రీప్రొడక్షన్ వర్క్ మొద‌ల‌వుతుందని సందీప్ చెప్పాడు. ఈ సినిమాకు క‌థ రెడీ అయింద‌ని.. ఈ గ్యాప్ లో ట్రీట్మెంట్, డైలాగ్స్ మీద‌ వర్క్ చేయాల్సి ఉంద‌ని చెప్పాడు సందీప్. ఇక అల్లు అర్జున్, మ‌హేష్ బాబుల‌తో సినిమాల సంగతి ఏమైంద‌ని అడిగితే.. మహేష్ బాబుకు ఓ కథ చెప్పానని.. అది ఆయనకి నచ్చిందని.. అయితే వేరే కమిట్మెంట్స్ వల్ల అది ముందుకు వెళ్ళలేదని సందీప్ తెలిపాడు. మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్.. ఇలా అందరితోనూ సినిమాలు చేయాలని త‌న‌కుంద‌ని సందీప్ చెప్పాడు.

ఇక యానిమ‌ల్ సినిమా ర‌న్ టైం మ‌రీ 3 గంట‌ల 21 నిమిషాలు ఉండ‌టంపై పెద్ద చ‌ర్చ జ‌రుగుతున్న నేప‌థ్యంలో అది స‌మ‌స్య కాదా అని సందీప్‌ను అడిగితే.. అర్జున్ రెడ్డి మూడు గంటల ఆరు నిమిషాల సినిమా. అది ఒక అమ్మాయి-అబ్బాయి కథే. యానిమల్ లో ఒక కుటుంబం, ప్రత్యర్ధులు ఇలా లేయర్స్ వున్నాయి. అర్జున్ రెడ్డి కంటే పదిహేను నిముషాలకే ఎక్కువ. ఇంకొ పది నిముషాలు హాయిగా ఏసీలో కూర్చుని సినిమాని ఎంజాయ్ చేస్తారనే నమ్మకం వుంది అని సందీప్ చెప్పాడు.