ఊపిరి వచ్చిన ఎనిమిదేళ్లకు రీమేక్

నాగార్జున, కార్తీ కాంబినేషన్ లో వచ్చిన ఊపిరి సినిమాని అభిమానులు చాలా స్పెషల్ గా ఫీలవుతారు. ఒక పెద్ద స్టార్ హీరో చక్రాల కుర్చీలో నటించడమనే పాయింట్ ని దర్శకుడు వంశీ పైడిపల్లి తీర్చిదిద్దిన తీరు ఆడియన్స్ ని మెప్పించింది. 2016లో వచ్చిన ఈ ఎమోషనల్ ఎంటర్ టైనర్ వల్లే నాగ్, కార్తీ బాండింగ్ బలపడింది. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ సర్దార్, జపాన్ హక్కులు కొని తెలుగులో రిలీజ్ చేయడానికి కారణం ఇదే. ఊపిరి ఫ్రెంచ్ మూవీ ది ఇన్ టచబుల్స్ కు రీమేకన్న సంగతి తెలిసిందే. కాకపోతే కేవలం థీమ్ ని మాత్రమే తీసుకుని నేటివిటీకి తగ్గట్టు చాలా మార్పులు చేశారు.

ఇప్పుడు ఎనిమిది సంవత్సరాల తర్వాత ఊపిరిని హిందీలో తీయబోతున్నారు. ఒరిజినల్ వెర్షన్ ని కాకుండా తెలుగులో వాడిన ప్యాట్రన్ ని వాడబోతున్నట్టు తెలిసింది. నాగార్జున పాత్రలో అమితాబ్ బచ్చన్, కార్తీ క్యారెక్టర్ కు రాజ్ కుమార్ రావుని లాక్ చేసినట్టు తెలిసింది. కరణ్ జోహార్ నిర్మాతగా భారీ బడ్జెట్ తో ఇది తెరకెక్కనుంది. అయితే దర్శకుడిగా ఆయన వ్యవహరిస్తారా లేక వేరొకరిని తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. అమితాబ్ బచ్చన్ కు ఇలాంటి రోల్స్ కొట్టిన పిండి. పైగా వీల్ చైర్ లో ఉన్నా ఓ రేంజ్ లో చెలరేగిపోవడం పా లాంటి చిత్రాల్లో ఎప్పుడో చూశాం.

బాగానే ఉంది కానీ ఓటిటి కాలంలో రీమేకులు వీలైనంత ఆలస్యం చేయకుండా త్వరగా తీస్తే బెటర్. గ్లోబల్ కంటెంట్ ప్రేక్షకులకు మరీ దగ్గరగా వచ్చేసింది. స్మార్ట్ ఫోన్ లేదా టీవీ ఉంటే చాలు ఏ భాషలో వచ్చినా సినిమా అయినా సరే క్షణాల్లో చూడగలుగుతున్నారు. అలాంటిది ఊపిరిని ఇప్పుడు తీయాలనుకోవడం సాహసమే. షూటింగ్ ఇంకా మొదలుకాలేదు. అసలే హిందీలో గత కొంత కాలంగా రీమేకులు చాలా దారుణమైన ఫలితాలు ఇస్తున్నాయి. దృశ్యం 2 లాంటి ఒకటి రెండు తప్ప మిగిలినవన్నీ ఫెయిల్యూర్సే. ఈ నేపథ్యంలో ఊపిరిని నార్త్ జనాలు ఏ మేరకు రిసీవ్ చేసుకుంటారో చూడాలి.