తగ్గేదేలే అంటున్న అనిమల్ దర్శకుడు

వచ్చే డిసెంబర్ 1 విడుదల కాబోతున్న అనిమల్ మీద ఆడియన్స్ ఫీవర్ మెల్లగా పెరిగిపోతోంది. టీజర్ ఇప్పటికే అంచనాలు పెంచేయగా ట్రైలర్ వచ్చాక ఏర్పడే హైప్ ఊహకందదని యూనిట్ వర్గాలు ఊరిస్తున్నాయి. అయితే సినిమా రన్ టైం గురించి గత పది రోజులుగా రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మాత్రం 3 గంటల 21 నిమిషాల వెర్షన్ ని లాక్ చేసినట్టు బాలీవుడ్ టాక్. తనను కాదని నిర్మాతలు నిర్ణయం తీసుకోలేరు కాబట్టి సెన్సార్ కు వెళ్ళేలోపు ఏదో ఒకటి ఫైనల్ చేయాలి. టి సిరీస్ అధినేతలు 3 గంటల 2 నిముషాలవైపు మొగ్గు చూపుతున్నారట.

ఇంత లెన్త్ అంటే థియేటర్లో వేసే షోల పరంగానూ ఇబ్బందులు తలెత్తుతాయి. రెండు ఇంటర్వెల్స్ ఇవ్వాల్సిన పరిస్థితి తలెత్తొచ్చు. అదే జరిగితే అదనంగా ఇంకో ఇరవై నిముషాలు ప్రేక్షకులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంటే హాలులోకి అడుగు పెట్టాక నాలుగు గంటల సేపు గడపటం చిన్న విషయం కాదు. మల్టీప్లెక్సులకు షోలు ప్లాన్ చేసుకోవడం సమస్యగా మారుతుంది. సందీప్ వంగా మాత్రం అనిమల్ లో డెప్త్ ని ప్రేక్షకులు ప్రేక్షకులు ఫీలవ్వాలంటే ఇది అవసరమేనని, మొదటి రోజు ఫీడ్ బ్యాక్ కనక ఈ ఒక్క పాయింట్ మీద నెగటివ్ వస్తే అప్పుడు మీ ఇష్టమని అన్నాడట.

ఈ లెక్కన ముందు సందీప్ చెప్పిన ప్రకారం సెన్సార్ చేయించి తర్వాత కావాలంటే కత్తిరింపులు చేసుకున్నా ఏ చిక్కులూ ఉండవు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన అనిమల్ లో అనిల్ కపూర్ పాత్ర చాలా కీలకం కానుంది. బాలీవుడ్ లో ఇప్పటిదాకా చూడని ఎమోషనల్ ఫాదర్ సెంటిమెంట్  ఇందులో ఉంటుందట. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం ఇప్పటికే మ్యూజిక్ లవర్స్ కి బాగా ఎక్కేసింది. డిసెంబర్ 22 సలార్, డంకి వచ్చే దాకా అనిమల్ రన్ ఉంటుందని బయ్యర్లు అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల హక్కులను నిర్మాత దిల్ రాజు ఫ్యాన్సీ రేటుకు కొన్నట్టు ఇండస్ట్రీ టాక్.