ఆశిష్ కోసం దిల్ రాజు క్రేజీ ప్లాన్స్

మేనల్లుడు ఆశిష్ రెడ్డిని హీరోగా సెటిల్ చేయడం కోసం నిర్మాత దిల్ రాజు సెట్ చేస్తున్న కాంబినేషన్లు మాములుగా లేవు. మొదటి సినిమా రౌడీ బాయ్స్ కి అనుపమ పరమేశ్వరన్ ని హీరోయిన్ గా తీసుకుని, దేవిశ్రీ ప్రసాద్ ని సంగీత దర్శకుడిగా సెట్ చేయడం దగ్గరి నుంచే ఈ ప్లానింగ్ మొదలయ్యింది. రెండో మూవీ సెల్ఫిష్ కి బిజీగా ఉన్న సుకుమార్ తో రచన చేయించి మరీ రేంజ్ పెంచే  విధంగా ప్రణాళికలు రచించారు. తర్వాత సినిమాకి బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్యని తీసుకోవడం దాదాపు కన్ఫర్మే. ఇవన్నీ ఒక ఎత్తయితే శ్రీలీలను ఆశిష్ కి ఆన్ స్క్రీన్ జోడిగా తీసుకొచ్చే ట్రయిల్స్ ముమ్మరం చేశారని టాక్.

ఇంకా ప్రకటించలేదు కానీ తెరవెనుక ప్రయత్నాలైతే జరుగుతున్నాయి. రౌడీ బాయ్స్ ఆశించిన ఫలితం అందుకోలేకపోయినా ఒక హిట్ మూవీ కరెక్ట్ గా పడితే కెరీర్ ఊపందుకుంటుంది. ఒక నిర్మాత కుటుంబం నుంచి స్టార్ హీరో తయారు కావడం చాలా అరుదు. ఒక్క రామానాయుడు గారికే అది సాధ్యమయ్యింది. పెద్దబ్బాయి సురేష్ బాబు నిర్మాణ వ్యవహారాలకు పరిమితమైతే వెంకటేష్ రెండో తరం అగ్ర హీరోల్లో ఒకరిగా తిరుగు లేని స్థానం సంపాదించుకున్నారు. ఇప్పుడు దిల్ రాజు లక్ష్యం కూడా ఇదే అనిపిస్తోంది. ఆశిష్ ని ఎలాగైనా మార్కెట్ ఉన్న హీరో స్థాయికి తీసుకెళ్లాలి.

నెమ్మదిగానే షూటింగ్ జరుపుకుంటున్న సెల్ఫిష్ విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా దిల్ రాజు  అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారట. రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు ఆశిష్ కోసం ఇవన్ని చేయడంలో ఆశ్చర్యం లేదు కానీ కుర్రాడికి సరైన బ్రేక్ దొరికితేనే ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలడు. అల్లు అరవింద్ ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా స్టార్ అయ్యారు కానీ శిరీష్ ఇప్పటికీ కనీస స్థాయిలో కుదురుకోలేదు. ఇక్కడ మాట్లాడేది సక్సెస్ లే కాబట్టి ఆశిష్ కు ఒకటి రెండు బ్లాక్ బస్టర్లు పడితే అప్పుడు నిర్మాతలు వద్దన్నా వెంట పడతారు.