తారక్ బాలీవుడ్ ఎంట్రీ.. శకునం బాలేదు

టాలీవుడ్ యంగ్ స్టార్లలో రామ్ చరణ్‌ ‘జంజీర్’తో, ప్రభాస్ ‘ఆదిపురుష్’తో బాలీవుడ్ అరంగేట్రం చేశారు. వాళ్లిద్దరికీ అక్కడ కాలం కలిసి రాలేదు. ఆ రెండు చిత్రాలూ నిరాశకు గురి చేశాయి. ఇక టాలీవుడ్ నుంచి నేరుగా బాలీవుడ్ అరంగేట్రం చేస్తున్న హీరో జూనియర్ ఎన్టీఆరే. అతను యశ్ రాజ్ ఫిలిమ్స్ లాంటి పెద్ద బేనర్లో ‘వార్-2’ లాంటి క్రేజీ సీక్వెల్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయి. స్క్రిప్టు రెడీ అయింది.

ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. ఇంకో రెండు నెలల్లోనే షూటింగ్ మొదలవుతుందని అంటున్నారు. తారక్ కూడా అప్పటికల్లా ‘దేవర’ పూర్తి చేసి రెడీగా ఉంటాడని తెలుస్తోంది. ఐతే ‘వార్-2’ ముంగిట శకునాలు అయితే అంత ఆశాజనకంగా కనిపించడం లేదు. యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్శ్‌‌లో భాగంగా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘టైగర్-3’ తుస్సుమనిపించింది.

తొలి రోజు కొంత పాజిటివ్, కొంత నెగెటివ్ టాక్ తెచ్చుకున్న ‘టైగర్-3’కి రోజులు గడిచేకొద్దీ నెగెటివ్ టాక్ పెరుగుతోంది. మూడో రోజుకల్లా సినిమా డిజాస్టర్ అని తేల్చేశారు. ముందు సినిమాను భుజాన మోసిన వాళ్లు కూడా నెమ్మదిగా కిందికి దించేస్తున్నారు. ఏముందీ సినిమాలో అన్నట్లు మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో ‘టైగర్-3’ మీద మీమ్స్, జోక్స్ ఒక రేంజిలో పేలుతున్నాయి. యశ్ రాజ్ వాళ్ల స్పై సినిమాలన్నీ ఒక మూసలో సాగిపోతున్నాయని.. కొత్తదనం ఉండట్లేదని.. రైటింగ్ దగ్గరే తేడా కొడుతోందని.. దీనికి తోడు సరైన దర్శకులను ఎంచుకోకపోవడం కూడా మైనస్ అవుతోందనే చర్చ నడుస్తోంది.

సాఫ్ట్ సినిమాలు తీసిన మనీశ్ శర్మ చేతికి ‘టైగర్-3’ ఇవ్వడం పెద్ద తప్పిదంగా పేర్కొంటున్నారు. ఇక ‘వార్-2’ విషయానికి వస్తే. ‘వార్’ తీసిన సిద్దార్థ్ ఆనంద్‌‌తో కాకుండా ‘బ్రహ్మాస్త్ర’ దర్శకుడు అయాన్ ముఖర్జీకి ఈ ప్రాజెక్టును అప్పగించడం చాలామందికి రుచించడం లేదు. అసలే యశ్ రాజ్ వాళ్ల స్పై సినిమాలు జనాలకు మొహం మొత్తేస్తున్నాయి. దీనికి తోడు ‘వార్-2’కు దర్శకుడు మారడం ప్రతికూలం అయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తారక్ బాలీవుడ్ ఎంట్రీ ఎలా ఉంటుందో ఏమోనన్న కంగారు అభిమానుల్లో కనిపిస్తోంది.