సలార్ ప్రచారం నిజమేనా రాఖీ భాయ్

సలార్ కౌంట్ డౌన్ ముప్పై ఎనిమిది రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే విపరీతమైన జాప్యం, వాయిదాలతో ఆలస్యమవుతూ వచ్చిన ఈ యాక్షన్ గ్రాండియర్ డిసెంబర్ 22 థియేటర్లలో బులెట్ల వర్షం కురిపించేందుకు సిద్ధమయ్యింది. ప్రభుత్వాలు అనుమతులు ఇస్తే అన్ని చోట్ల ఒకేసారి అర్ధరాత్రి 12 గంటల 22 నిమిషాల 22 సెకండ్లకు ప్రీమియర్లు వేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. టికెట్ రేట్ల పెంపుకి సంబంధించి ఆల్రెడీ ప్రతిపాదనలు పెట్టేశారు. దాదాపు ఖరారు కావొచ్చు. సలార్ కు సంబంధించిన మరో ఆసక్తికరమైన ప్రచారం తిరిగి చక్కర్లు కొట్టడంతో అభిమానుల్లో కొత్త చర్చ మొదలయ్యింది.

సలార్ పార్ట్ వన్ సీజ్ ఫైర్ క్లైమాక్స్ లో కెజిఎఫ్ రాఖీ భాయ్ ఎంట్రీ ఉంటుందని, కనిపించేది కేవలం కొద్దినిమిషాలే అయినా ప్రభాస్, యష్ ఇద్దరూ ఒకే ఫ్రేమ్ లో కనిపించే ఎపిసోడ్ ని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఓ రేంజ్ లో సెట్ చేసి ఉంటాడని ఏవేవో ఊహించుకుంటున్నారు. నిజానికి దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. కెజిఎఫ్ 2 చివర్లో రాఖీ భాయ్ బంగారం మొత్తం సముద్రంలో పారేసే ముందు నడిపే షిప్పులో టైంకి, సలార్ టీజర్ లో చూపించిన ఒక షాట్ కి ముడిపెట్టడం వల్ల ఇలాంటి వెరైటీ విశ్లేషణలు బయటికి వచ్చాయి.

యూనిట్ మాత్రం నిజమా కాదాని చెప్పకుండా ఎలాంటి లీకులు రాకుండా జాగ్రత్త పడుతోంది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇందులో యష్ క్యామియోలాంటిది ఉండకపోవచ్చు. లియోలో రామ్ చరణ్, టైగర్ 3లో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడని వాటి రిలీజ్ కు వారం పది రోజులు  ముందు నుంచి ఎలా అయితే ప్రచారంతో సోషల్ మీడియాని ఊదరగొట్టారో ఇప్పుడు అదే వర్గాలు సలార్ విషయంలోనూ పని చేస్తూ ఉండొచ్చు. నిర్మాతలు, దర్శకుడు వీటిని పట్టించుకునే పరిస్థితిలో లేరు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు అంత ఒత్తిడి మీద జరుగుతున్నాయి. డిసెంబర్ 1న వచ్చే ట్రైలర్ లో పార్ట్ 2 గురించి ఏదైనా క్లూ ఇస్తేనే గొప్పనుకోవచ్చు.