ఎస్.జె.సూర్య క్రేజ్ మీదే ఆడాలి

పదేళ్లు వెనక్కి వెళ్తే.. ఎస్.జె.సూర్యను అందరూ ఒక దర్శకుడిగానే చూసేవాళ్లు. అప్పటికే నటుడిగా తన స్వీయ దర్శకత్వంలో కొన్ని సినిమాల్లో లీడ్ రోల్స్ చేసినప్పికీ.. తనలో ఒక విలక్షణమైన నటుడు ఉన్నాడని ఎవరూ గుర్తించలేదు. కానీ తమిళంలో ‘ఇరైవి’ సహా కొన్ని చిత్రాల్లో తన నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. డిజాస్టర్ అయిన ‘స్పైడర్’లో సూర్య చేసిన విలన్ పాత్ర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. తమిళంలో మరికొన్ని సినిమాల్లో విలన్ పాత్రతో అతను అలరించాడు.

‘మానాడు’ లాంటి సినిమాలు బ్లాక్ బస్టర్ కావడంలో సూర్య పాత్ర కీలకం. ఇక వినాయక చవితి టైంలో వచ్చిన ‘మార్క్ ఆంటోనీ’ ఏకంగా వంద కోట్ల గ్రాస్ మార్కును టచ్ చేసిందంటే అందులో సూర్యది మేజర్ రోల్. డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో సూర్య విజృంభించి నటించాడు. సినిమాను తన భుజాల మీద మోశాడు. ఆ సినిమా తెలుగులో కూడా ఓ మోస్తరు వసూళ్లు రాబట్టిందంటే సూర్య ఆకర్షణ వల్లే.

సూర్యకు ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందంటే.. అతడికి పది కోట్ల పారితోషకం ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్నారు. ఇటీవలే నాని సినిమాకు అంత రెమ్యూనరేషన్ ఇచ్చే అతణ్ని తీసుకున్నారు. దీపావళి వీకెండ్లో రానున్న ‘జిగర్ తండ డబులెక్స్’ సినిమాకు కూడా ప్రధాన ఆకర్షణ సూర్యనే. ఇందులో రాఘవ లారెన్స్ మరో లీడ్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. కానీ లారెన్స్ సినిమాలంటే కొన్నేళ్ల నుంచి జనాలు భయపడి పోయే పరిస్థితి వచ్చింది.

అతను చేసే రొడ్డ కొట్టుడు మాస్ సినిమాలు జనాల్ని బెంబేలెత్తించేస్తున్నాయి. ‘జిగన్ తండ డబులెక్స్’లో లారెన్స్ పాత్ర విభిన్నంగానే అనిపిస్తున్నప్పటికీ.. ఈ చిత్రాన్ని క్యారీ చేయాల్సింది సూర్యనే అని భావిస్తున్నారు. ఒక క్రేజీ మూవీకి సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రానికి తమిళంలో మంచి హైపే ఉంది. తెలుగులో సురేష్ బాబు, ఏషియన్ సునీల్ లాంటి పెద్ద నిర్మాతలు ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా సినిమాకు ఓపెనింగ్స్  తీసుకొచ్చేది సూర్యనే అనడంలో సందేహం లేదు. మన దగ్గర కూడా తన క్రేజ్ అలా ఉంది మరి. తన పాత్ర, పెర్ఫామెన్స్ క్లిక్ అయితే ఈ సినిమా హిట్ అయినట్లే.