పేక ముక్కలతో మహేష్-వెంకీ.. మీమ్స్ మోత

సూపర్ స్టార్ మహేష్ బాబు రిజర్వ్డ్ పర్సన్ లాగా కనిపిస్తాడు. ఏదైనా ఈవెంట్లు ఉన్నపుడు ఇండస్ట్రీ జనాలను కలవడమే తప్ప బయట పార్టీల్లాంటి వాటిలో కనిపించడం అరుదు. ఆయనకు పక్కా ఫ్యామిలీ మ్యాన్ ఇమేజ్ ఉంది. ఇక విక్టరీ వెంకటేష్ సంగతీ తెలిసిందే. ఆయన కూడా చాలా రిజర్వ్డ్‌గా కనిపిస్తారు. ఎక్కువగా ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుతుంటారు. ఆయన కూడా పార్టీల్లో కనిపించే వ్యక్తి కాదు.

ఐతే వీళ్లిద్దరూ శనివారం రాత్రి ఒక క్లబ్ హౌస్‌లో పేక ముక్కలతో కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఫొటోలు నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక ప్రముఖ వ్యాపారవేత్తకు సంబంధించిన క్లబ్ హౌస్ ప్రారంభోత్సవానికి వెంకీ, మహేష్ అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఇంకొందరు ఫిలిం సెలబ్రెటీలు, రాజకీయ నేతలు కూడా పాల్గొన్నారు. కానీ అందరి దృష్టినీ ఆకర్షించింది మాత్రం మహేష్, వెంకీలే.

వెంకీ నిన్న సాయంత్రం ‘జిగర్ తండ డబులెక్స్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్నారు. అక్కడ కాసేపు సందడి చేశాక చిన్న స్పీచ్ ఇచ్చారు. ఆ సందర్భంగా తాను ఎక్కువ సేపు ఉండలేనని.. వేరే ప్రోగ్రాం ఉందని చెప్పి వెళ్లిపోయారు. కాసేపటికి ఆయన మహేష్‌తో కలిసి క్లబ్ హౌస్‌లో కనిపించారు. వీళ్లిద్దరూ పేక ముక్కలతో కనిపించడం మీద బోలెడన్ని జోకులు, మీమ్స్ పేలుతున్నాయి. వెంకీ చెప్పిన చిన్న ప్రోగ్రాం ఇదేనా అంటూ ఆయన మీద మీమ్స్ వేస్తున్నారు నెటిజన్లు.

అలాగే మహేష్ ఈ కార్యక్రమంలో కనిపించడం చూసి.. మీరు మారిపోయారు సార్ అనే మీమ్ సహా అనేక మీమ్స్ సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. పెద్దోడు-చిన్నోడు బాగా బిజీగా ఉన్నట్లున్నారని.. వీళ్లీ పని చేస్తుంటే రేలంగి మావయ్య ఏం చేస్తున్నాడని.. ఇలా రకరకాల కామెంట్లతో వినోదాన్ని పంచుతున్నారు నెటిజన్లు.