సలార్ పుకార్లకు చెక్ పెట్టాల్సిందే

ఒక పెద్ద ప్యాన్ ఇండియా మూవీని హ్యాండిల్ చేస్తున్నప్పుడు సదరు నిర్మాణ సంస్థలు ప్రతిదీ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. అనుకున్నవన్నీ ఖచ్చితంగా జరుగుతాయని కాదు కానీ ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు దాన్ని సరైన రీతిలో కమ్యూనికేట్ చేయడం అవసరం. కానీ హోంబాలే ఫిలింస్ ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉండటాన్ని ఒప్పుకోక తప్పదు. దీని వల్ల పుకార్ల ప్రహసనం ఎక్కువయ్యింది. ఇప్పుడు రెండు భాగాలు కాదని ఒకటే పార్ట్ వస్తుందనే ప్రచారం ఊపందుకుంది. అంతేకాదు ముందు లేని ఐటెం సాంగ్ ఇప్పుడు హఠాత్తుగా పెట్టి తీస్తున్నారని మరో టాక్ మొదలైంది.

ఇంకొందరు అడుగు ముందుకేసి సలార్ ఏకంగా 2024 మార్చికి పోస్ట్ పోన్ అయ్యిందని గాసిప్ తిప్పుతున్నారు. ఇది ముమ్మాటికీ నిజం కాదు. ఎందుకంటే డిసెంబర్ 22 తేదీకి అనుగుణంగా ఓవర్సీస్ స్క్రీన్లు బుక్ చేసేశారు. ఏపీ తెలంగాణ ఏరియాల వారిగా డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు లిస్ట్ అవుతున్నారు. కొన్ని ఒప్పందాలు సంతకాలు చేసుకోవడం కూడా అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ ఏ దశలో ఉందనేది దర్శకుడు ప్రశాంత్ నీల్ బయటికి చెప్పొద్దంటూ స్ట్రిక్ వార్నింగ్ ఇవ్వడంతో యూనిట్ సభ్యులు చాలా గుట్టుని మైంటైన్ చేస్తున్నారు. సంగీత దర్శకుడు రవి బస్రూర్ బయట కనిపించడమే మానేశాడు.

రీ రికార్డింగ్ పనులు అంత పీక్స్ లో ఉన్నాయి. సలార్ ప్రమోషన్లు ఈ నెల చివరి నుంచి ఊపందుకోవాలి. వీటి సంగతి ఎలా ఉన్నా ట్రైలర్ వస్తే తప్ప ఊపు వచ్చేలా లేదు. ఇంకోవైపు షారుఖ్ ఖాన్ డుంకీ ఫస్ట్ టీజర్ ఆల్రెడీ జనాన్ని ఆకట్టుకుంది. మాస్ కంటెంట్ కాకపోయినా రాజ్ కుమార్ హిరానీ నుంచి ఆశించే అంశాలకు లోటు లేదని క్లారిటీ ఇవ్వడంతో నార్త్ ఆడియన్స్ లో ఆసక్తి పెరుగుతోంది. డ్రాప్ 2 పేరుతో రెండో టీజర్ వచ్చే లోపు సలార్ ట్రైలర్ దింపక పోతే ఇబ్బందులు తలెత్తుతాయి. అప్పుడు కొత్త పుకార్లకు రెక్కలు తొడిగినట్టు అవుతుంది. అలా కాకూడదనే ఫ్యాన్స్ కోరిక.