40 వసంతాల ‘ఖైదీ’ ఫ్లాష్ బ్యాక్

సరిగ్గా నలభై సంవత్సరాల క్రితం ఇదే రోజు అక్టోబర్ 28 చిరంజీవి అనే వేగాన్ని తెరకు పరిచయం చేసిన ఖైదీ విశేషాలు చూద్దాం. 1983లో కొత్తగా పరిశ్రమకు వచ్చిన నిర్మాత డాక్టర్ తిరుపతిరెడ్డి స్నేహితులతో కలిసి కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా తీయాలని నిర్ణయించుకుని అప్పుడప్పుడే పైకొస్తున్న చిరంజీవి డేట్లు తీసుకున్నారు. ముందో కథ అనుకున్నారు కానీ ఎవరికీ నచ్చలేదు. ఓపెనింగ్ డేట్ ముందే ఫిక్స్ చేసుకున్నారు. రోజులు దగ్గర పడుతున్న టైంలో పరుచూరి బ్రదర్స్ కి అంతకు ముందు ఏడాది చూసిన హాలీవుడ్ మూవీ రాంబో ఫస్ట్ బ్లడ్ గుర్తొచ్చింది. అంతే దాని ప్రారంభాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఒక్క రోజులో అల్లేశారు.

కట్ చేస్తే అనుకున్న టైంకే సూపర్ స్టార్ కృష్ణ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. వేగంగా షూటింగ్ చేశారు. 15 లక్షల దాకా బడ్జెట్ అయ్యిందని అప్పటి మీడియాలో వచ్చింది. మాధవి హీరోయిన్, రావుగోపాలరావు మెయిన్ విలన్, సుమలత, నూతన్ ప్రసాద్, రంగనాథ్, సంగీత, పిఎల్ నారాయణ, సుత్తివేలు, రాళ్ళపల్లి తదితరులను ఇతర పాత్రలకు తీసుకున్నారు. రిలీజ్ డేట్ కి రెండు రోజుల ముందు సెన్సార్ అయ్యింది. ఆ టైంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో భీకరమైన వర్షాలు. అయినా ఖైదీ ప్రభంజనం ఆగలేదు. ముందు యావరేజ్ టాక్ వచ్చి ఆ తర్వాత బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోయింది.

ఏకంగా 20 సెంటర్లలో వంద రోజులు ఆడటం ఒక రికార్డు. ఉదయం ఆటలతో హైదరాబాద్ శాంతి థియేటర్లో ఏడాది నడిచింది. సంగీత దర్శకులు చక్రవర్తి స్వరపరిచిన పాటలు చార్ట్ బస్టర్ అయ్యాయి. 1984 ఫిబ్రవరి చెన్నైలో హండ్రెడ్ డేస్ ఫంక్షన్ చేశారు. అదే ఏడాది ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావడం గురించి మాట్లాడుకున్నట్టే ఈ ఖైదీ కూడా హాట్ టాపిక్ అయ్యిందని అతిధిగా వచ్చిన ఎంఎస్ రెడ్డి అన్నారు. హిందీలో జితేంద్ర, కన్నడలో విష్ణువర్ధన్ తో ఖైదీ రీమేక్ అయ్యింది. చిరంజీవికి విపరీతంగా అభిమాన సంఘాలు పుట్టుకొచ్చాయి. అందుకే నూటా యాభైకి పైగా సినిమాల ప్రయాణంలో ఖైదీ మైలురాయి చిరుకెంతో ప్రత్యేకం.