‘కంచరపాలెం’ దర్శకుడు హీరోలకు కథలు చెబితే..

‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాతో అందరి దృష్టినీ ఆకర్షించిన దర్శకుడు వెంకటేష్ మహా. ఆ సినిమాతో అతడిపై అంచనాలు పెరిగిపోయాయి. తన నుంచి ఇలాంటి వైవిధ్యమైన, ఒరిజినల్ సినిమాలు ఎన్నో ఆశించారు ప్రేక్షకులు. కానీ అతను తన రెండో చిత్రంగా ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ అనే రీమేక్ తీశాడు. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడేదో ‘మర్మాణువు’ అనే సినిమా చేస్తున్నాడు. అది ప్రకటించి చాన్నాళ్లయింది.

దాని విశేషాలేవీ బయటికి రాలేదు. వెంకటేష్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించడంతో పాటు ఓ కీలక పాత్ర కూడా చేసిన ‘మార్టిన్ లూథర్ కింగ్’ ఈ రోజే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఒక మీడియా ఇంటర్వ్యూలో భాగంగా దర్శకుడిగా తన కెరీర్లో చాలా గ్యాప్ రావడంపై స్పందించాడు. తాను హీరోలకు కథలు చెబుతున్నప్పటికీ అవి ఓకే కావట్లేదంటూ వెంకటేష్ వ్యంగ్యాస్త్రాలు విసిరాడు.

తాను ఒక ప్రముఖ నటుడికి ఒక ప్రేమకథ చెప్పానని.. ఐతే అతను ‘పుష్ప’ తరహా కథ చేయాలనుకుంటున్నట్లు చెప్పాడని వెంకటేష్ మహా తెలిపాడు. తర్వాత మరో హీరోకు తాను ఇంకో కథ చెప్పగా.. దాన్ని ‘కేజీఎఫ్’ తరహాలో మార్చాలని తన టీం సూచించిందని వెంకటేష్ అన్నాడు. పుష్ప, కేజీఎఫ్ లాంటి సినిమాలే చేయాలనుకుంటే.. వాటిలో హీరోల బదులు తమ ముఖాలను ఏఐ ద్వారా మార్చి చూసుకుంటే సరిపోతుందని.. అంతే తప్ప తాము కూడా అవే సినిమాలు చేస్తామంటే ఎలా అని వెంకటేష్ సెటైర్ వేశాడు.

ఆయా హీరోలు చెప్పినట్లు కథలు మార్చడం ఇష్టం లేక వాళ్లతో సినిమాలు చేయలేదని వెంకటేష్ స్పష్టం చేశాడు. దర్శకుడిగా తన కెరీర్లో గ్యాప్ రావడానికి ఇదే కారణమని అతను చెప్పాడు. తాను అనుకున్నట్లుగానే ‘మర్మాణువు’ అనే సినిమా చేస్తున్నట్లు అతను తెలిపాడు. ఇంతకుముందు ఓ ఇంటర్వ్యూలో భాగంగా ‘కేజీఎఫ్’ సినిమా మీద వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపగా.. తాజా వ్యాఖ్యలతో అతను మరోసారి వార్తల్లో నిలిచేలా ఉన్నాడు.