ప్రశాంత్ నీల్ వ్యవహారమంటే ఇంతే మరి

ఇవాళ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఖచ్చితంగా ఒక స్పెషల్ పోస్టర్ లేదా టీజర్ ఉంటుందని ఎదురు చూసిన అభిమానులకు నిరాశ కలిగిస్తూ హోంబాలే ఫిలిమ్స్ పాతవాటినే కొత్తగా కుట్టిచ్చి నిరాశ పరిచింది. ఇంకో రెండు నెలల్లో రిలీజ్ పెట్టుకుని ఇలా చేయడం పట్ల ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇక్కడ ప్రొడక్షన్ హౌస్ వైపు నుంచి ఎలాంటి లోటు జరగలేదని, దర్శకుడు ప్రశాంత్ నీల్ సూచనల మేరకే అప్డేట్ ప్లాన్ చేయలేకపోయారని బెంగళూరు టాక్. నిర్మాతలు సిద్ధంగా ఉన్నా డైరెక్టర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రానిదే ఎవరైనా ఏం చేయగలరు.

నిజానికి ప్రశాంత్ నీల్ కి పని రాక్షసుడని పేరు. పర్ఫెక్షన్ కోసం ఎంత రిస్క్ అయినా, ఎంత బడ్జెట్ అయినా లెక్క చేయరు. ఇది ముందే చెప్పి అగ్రిమెంట్ మీద సంతకం పెడతారు. కెజిఎఫ్ టైంలోనూ రషెస్ సంతృప్తికరంగా  లేవని మళ్ళీ మళ్ళీ తీసిన ఎపిసోడ్లు చాలానే ఉన్నాయట. అవుట్ ఫుట్ విషయంలోనే కాదు టీజర్, ట్రైలర్, పోస్టర్ ఏదైనా సరే తాను అనుకున్నట్టు వస్తే తప్ప ఓకే చెప్పరు. హీరో పుట్టినరోజు అయినా ఇంకేదైనా ప్రత్యేక కారణమున్నా సరే అందరికీ ఒకటే రూల్. అందుకే వాయిదా వార్త కూడా అనుకున్న సమయం కంటే ఆలస్యంగా చెప్పాల్సి వచ్చిందని ఇన్ సైడ్ టాక్.

ఇదంతా ఓకే కానీ ప్రశాంత్ నీల్ నెక్స్ట్ చేయబోయేది జూనియర్ ఎన్టీఆర్ తో. దేవర 1, వార్ 2 షూటింగ్ లు పూర్తయ్యాక తారక్ ఈ సెట్ లో అడుగు పెడతాడు. ఫైనల్ వెర్షన్ దాదాపుగా లాక్ అయినట్టే. మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించిన దాని ప్రకారం వచ్చే వేసవిలో షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు. అంటే అక్కడి నుంచి ఎలా లెక్కలేసుకున్నా కనీసం రెండేళ్లు దానికి కేటాయించాల్సి ఉంటుంది. అదే నిజమైతే తారక్ డేట్లు భారీ ఎత్తున త్యాగం చేయాల్సిందే. జూనియర్ ఫ్యాన్స్ కి ఈ టెన్షన్ తప్పదు. పైగా బడ్జెట్ కూడా కెజిఎఫ్, సలార్ లను మించి ఉంటుందని ఆల్రెడీ ప్రచారం జరుగుతోంది.