విజయదశమి గెలుపు గుర్రం ఎవరంటే

దసరా పండగకు నువ్వా నేనా అంటూ తలపడిన మూడు పెద్ద సినిమాల్లో విజేత ఎవరో క్లారిటీ వచ్చేసింది. టాక్, వసూళ్లు, అన్ని వర్గాల నుంచి రెస్పాన్స్ ని ప్రాతిపదికన తీసుకుంటే భగవంత్ కేసరినే విన్నర్ గా నిలుస్తాడు. ఇంకో రెండు రోజులు సెలవులు ఉన్నాయి కాబట్టి వసూళ్ల పరంగా అంత డ్రాప్ ఉండకపోవచ్చని సమాచారం. ట్రేడ్ టాక్ ప్రకారం బాలయ్య నాలుగు రోజులకు గాను సుమారు 65 కోట్ల గ్రాస్ తో 37 కోట్ల దాకా షేర్ రాబట్టాడు. బ్రేక్ ఈవెన్ కి ఇంకో ముప్పై కోట్ల దాకా షేర్ రావాల్సి ఉన్నా ఈ వారం చెప్పుకోదగ్గ రిలీజులు లేకపోవడంతో ఆ అవకాశాన్ని అనిల్ రావిపూడి టీమ్ వాడుకోవడం ఖాయం.

మరి లియో అంత డివైడ్ టాక్ లోనూ లాభాలు తెచ్చేలా ఉంది కదానే అనుమానం రావొచ్చు. కానీ డబ్బింగ్ మూవీ కావడం వల్ల దానికి జరిగిన థియేట్రికల్ బిజినెస్ కేవలం 16 కోట్లు. ఆశించిన స్థాయిలో లోకేష్ కనగరాజ్ సంతృప్తి పరచలేదనే టాక్ బయటికి వచ్చినా సరే ఒక్కసారైనా చూడాలని యూత్ ఫిక్స్ కావడం వల్ల మంచి నెంబర్లు నమోదయ్యాయి. సినిమా నచ్చినవాళ్లు లేకపోలేదు. బ్రేక్ ఈవెన్ కి ఇంకో ముప్పై లక్షల షేర్ దగ్గరలో ఉన్న లియో దాన్ని ఇవాళ సులభంగా అందుకుంటుంది. లాభాల్లోకి ప్రవేశించడం ఎంత మోతాదులో ఉంటుందనేది బుధవారానికి క్లారిటీ వస్తుంది.

ఇక టైగర్ నాగేశ్వరరావు మాత్రం ఎదురీదాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇరవై నిముషాలు ట్రిమ్ చేయడం కొంత బెటర్ గా అనిపిస్తున్నా దాని వల్ల అమాంతం కలెక్షన్లలో జంప్ లేదన్నది వాస్తవం. ఇప్పటిదాకా 22 కోట్ల గ్రాస్ తో 12 కోట్ల షేర్ రాబట్టిన మాస్ మహారాజా బ్రేక్ ఈవెన్ కి చాలా దూరంలో ఉన్నాడు. ఇంకో ఇరవై ఏడు కోట్లు షేర్ రావడమంటే మాటలు కాదు. పెట్టుబడి రాబడి లెక్కలో చూసుకుంటే లియో పై చేయిగా కనిపిస్తున్నా పబ్లిక్ రెస్పాన్స్, థియేటర్ ఆక్యుపెన్సీ వరకు భగవంత్ కేసరి నెంబర్ వన్ చైర్ తీసుకున్నాడు. ఇవాళ రేపు అడ్వాన్స్ బుకింగ్స్ మంచి ఊపుమీదుండటం దానికి సంకేతం.