నాయకుడు – తెలుగువాళ్ళు ఏం పాపం చేశారు  

మన దేశంలో ఇప్పటిదాకా వచ్చిన కొన్ని వందల గ్యాంగ్ స్టర్ సినిమాల్లో ‘నాయకుడు’ది ప్రత్యేక స్థానం. కమల్ హాసన్ హీరోగా ప్రముఖ డాన్ వరదరాజన్ ముదలియార్ ని స్ఫూర్తిగా తీసుకుని మణిరత్నం చెక్కిన ఈ అద్భుత దృశ్య కావ్యం దశాబ్దాలు గడుస్తున్నా ఎవర్ గ్రీన్ అనిపిస్తూనే ఉంటుంది. మూడు వయసులకు సంబంధించిన షేడ్స్ లో లోకనాయకుడు ఇచ్చిన పెర్ఫార్మన్స్ ఎప్పటికీ మర్చిపోలేం. 1987లో వచ్చిన ఈ క్లాసిక్ ని ఇప్పటి తరం యువకులు, మధ్య వయస్కులు థియేటర్లలో చూడకలేకపోయారు. యూట్యూబ్, టీవీ ఛానల్స్ లో తప్ప ఇంకో చోట అనుభూతి దక్కలేదు.

ఇంత గొప్ప క్లాసిక్ మళ్ళీ వెండితెర మీద వస్తోందంటే అంతకన్నా శుభవార్త ఏముంటుంది. నవంబర్ 3 నాయగన్ ని భారీ ఎత్తున రీ రిలీజ్ చేయబోతున్నారు. ప్రింట్ ని 4Kకి మార్చి డాల్బీ అట్మోస్ సౌండ్ జోడించి, కలర్ కరెక్షన్ తో పాటుగా స్కోప్ లోకి కూడా మారుస్తారట. తమిళనాడులో 120 థియేటర్లతో ప్రస్తుతం ఒప్పందం జరిగినట్టు టాక్. కేరళలోనూ భారీ విడుదలకు రంగం సిద్ధమయ్యింది. కన్నడ డబ్బింగ్ చేసే పనుల్లో టీమ్ బిజీగా ఉంది. ట్రాజెడీ ఏంటంటే నాయకుడు తెలుగు వెర్షన్ ని రిలీజ్ చేసే ఆలోచన చేయకపోవడం. ఆ దిశగా సూచనలు లేకపోవడం.

అప్పట్లో నాయకుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గొప్పగా ఆడింది. కొన్ని వంద రోజుల సెంటర్లున్నాయి. హోమ్ వీడియో అమ్మకాల్లో రికార్డులు సృష్టించింది. సౌత్ భాషలు అందరికీ చేరవేస్తున్నప్పుడు తెలుగు వాళ్ళు మాత్రం ఏం అన్యాయం చేశారని మూవీ లవర్స్ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి జనరేషన్ కు నాయకుడు లాంటి క్లాసిక్స్ ని పరిచయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లియోలు జవాన్ లు చూసి ఊగిపోతున్న యువతకు రియల్ ఫిలిం మేకింగ్ అంటే ఏంటో తెలియాలంటే వీటిని థియేటర్లకు తీసుకురావాలి. కాకపోతే తెలుగు ఫ్యాన్స్ ఏదో దురదృష్టం చేసినట్టు ఇక్కడ మాత్రం ఆ ఊసే లేదు.