మైత్రి థియేటర్ల వెనుక అసలు కథేంటి

మొదలుపెట్టిన తక్కువ సమయంలోనే అగ్ర నిర్మాణ సంస్థగా ఎదిగి ఉప్పెన, పుష్పలతో జాతీయ అవార్డులు సాధించే స్థాయికి చేరుకున్న మైత్రి మూవీ మేకర్స్ తాజాగా థియేటర్ల నిర్మాణంలోకి అడుగు పెట్టింది. ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతి రిలీజుల సందర్భంగా డిస్ట్రిబ్యూషన్ మొదలుపెట్టిన ఈ టాప్ బ్యానర్ ఇప్పుడు ఎగ్జిబిషన్ రంగంలోనూ కాలు పెట్టడం ద్వారా కొత్త సంకేతాలు ఇస్తోంది. పలు చోట్ల నిర్వహణ భారమైన హాళ్లను లీజుకు తీసుకోవడంతో పాటు అనువైన ప్రదేశాల్లో కొత్తగా నిర్మించే ప్రతిపాదనలను సీరియస్ గా విశ్లేషిస్తోంది. ఏడాది రెండేళ్లలో పెద్ద నెంబర్ ని సమీకరించబోతోంది

దీని వెనుక పలు ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీ తెలంగాణలో థియేటర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఏదైనా చిన్న సినిమా విడుదల చేయాలంటే పెద్ద తలనొప్పిగా మారుతోంది. ఈ మధ్య కాలంలో మైత్రి పలు తక్కువ బడ్జెట్ చిత్రాలకు చేయూతనిచ్చి రిలీజ్ కు సహకరించింది. అవి ఫ్లాప్ అవుతూ బ్రాండ్ ఇమేజ్ పరంగా కొంత ఇబ్బంది ఎదురవుతున్నా సరే ముందుకెళ్లేందుకే నిర్ణయించుకుంది. అయితే చేతిలో థియేటర్లు లేని కారణంగా అసలు కంటే కొసరు ఖర్చులు ఎక్కువన్నట్టు షోలకొచ్చే కలెక్షన్ కన్నా వాటిని వేసేందుకు అవుతున్న బిల్లే తడిసి మోపెడవుతోంది.

ఇది క్రమంగా లక్షల నుంచి కోట్లకు చేరే ప్రమాదం ఉంది. ఒకవేళ మనవే స్వంతంగా థియేటర్లు ఉంటే ఈ సమస్య రాదు. అద్దెలు, ఖర్చులు, జీతాలు స్వంతంగా చూసుకోవచ్చు. పైగా తీవ్రమైన పోటీ ఉన్నప్పుడు పెద్ద సినిమాలకు సైతం మైత్రికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. చిరంజీవి, బాలయ్యలాంటి పెద్ద హీరోలతో చేసినా ఒక డబ్బింగ్ మూవీకి మంచి స్క్రీన్లు వెళ్లడం ఆపలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఇలాంటి గుత్తాధిపత్యానికి చెక్ పెట్టాలంటే ఆసియన్, దిల్ రాజు, సురేష్, గీత బాటలో వెళ్లడమే కరెక్టని భావించిన మైత్రి దానికి అనుగుణంగానే కొత్త వ్యాపారంలో అడుగుపెడుతోంది.