ఇంత క్రేజీ బుకింగ్స్ వెనుక కారణమేంటి

ఏదో తమిళనాడులో అంటే ఏమో అనుకోవచ్చు కానీ తెలుగు రాష్ట్రాల్లోనూ లియో ఫీవర్ బాగానే ఉందని బుకింగ్స్ స్పష్టం చేస్తున్నాయి. భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు లాంటి తీవ్రమైన పోటీని పెట్టుకుని కూడా ఇంత క్రేజ్ తెచ్చుకోవడం మాములు విషయం కాదు. సరిహద్దుల్లో ఉండే సూళ్లూరుపేట, నగరి,  చిత్తూరు, నెల్లూరు లాంటి ఊళ్ళలో తెల్లవారుఝామున నాలుగు గంటల షోలకు ఏర్పాట్లు జరగడం గమనార్హం. ఎలాగూ తమ రాష్ట్రంలో 9 కన్నా ముందు షోలు పడవు కాబట్టి విజయ్ ఫ్యాన్స్ భారీ సంఖ్యలో బోర్డర్ ఊళ్ళ మీద గంపగుత్తగా బెనిఫిట్ షోలకు పోటెత్తబోతున్నారు.

ఇదే కాదు హైదరాబాద్ లాంటి చోట్ల రెగ్యులర్ షోలకు సైతం మంచి డిమాండ్ కనిపిస్తోంది. విజయ్ ఇమేజ్ ఒకటే దీనికి కారణమని చెప్పలేం. దర్శకుడు లోకేష్ కనగరాజ్ బ్రాండ్ తో పాటు స్టైలిష్ యాక్షన్ ఉంటుందనే అభిప్రాయం ఆడియన్స్ లో బలంగా ఉండటం ఫస్ట్ డేనే చూసేందుకు ప్రేరేపిస్తోంది. బాలయ్య సినిమాని ఫస్ట్ ఛాయస్ గా పెట్టుకున్న వాళ్ళు అదే రోజు వెంటనే లియో చూడాలని డిసైడయ్యారు. దీంతో ఓపెనింగ్స్ పరంగా ఏపీ, తెలంగాణలో అక్టోబర్ 19న క్రేజీ నెంబర్లు నమోదయ్యే ఛాన్స్ పుష్కలంగా ఉంది. స్క్రీన్ కౌంట్ పరంగా బాలయ్యదే పై చేయి కానుంది.

ఇక మిగిలిన చోట్ల చూస్తే బెంగళూరులో లియో ఫీవర్ పీక్స్ కు చేరుకుంది. ఒక్క ఐమాక్స్ ప్రీమియర్ టికెట్ 2500 రూపాయలు అధికారికంగా పెట్టినా సరే ఆన్ లైన్ లో సోల్డ్ అవుట్ బోర్డు వెక్కిరిస్తోంది. ఇక్కడే ఇలా ఉంటే చెన్నై పరిస్థితి వేరే చెప్పాలా. ట్రైలర్ మీద వచ్చిన నెగటివ్ ఫీడ్ బ్యాక్ ని ఫ్యాన్స్ తో పాటు రెగ్యులర్ మూవీ లవర్స్ సైతం అంత సీరియస్ గా తీసుకున్నట్టు లేరు. ఒకవేళ టాక్ పాజిటివ్ గా వస్తే సరేసరి లేదంటే బాలయ్య, రవితేజల మధ్య తెలుగులో నలిగిపోవడం ఖాయం. సాధారణ ప్రేక్షకులు మాత్రం మొదటి ఓటు భగవంత్ కేసరికి ఆ తర్వాత మాస్ మహారాజాకు వేస్తున్నారు.