కేరాఫ్ ఊర మాస్ ‘గాంజా శంకర్’

యాక్సిడెంట్ జరిగి సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి తెరపైకి వచ్చిన సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కు రిపబ్లిక్ ఫలితం నిరాశ పరిచినా ఈ ఏడాది విరూపాక్ష రూపంలో పెద్ద బ్లాక్ బస్టర్ దక్కింది. హారర్ జానర్ చేసినా గొప్ప ఫలితం అందుకోవడం అభిమానులను సంతోషంలో ముంచెత్తింది. కొంత కాలం రెస్ట్ తీసుకుంటానని చెప్పిన తేజు ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండానే మేకప్ వేసుకునేలా ఉన్నాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సంపత్ నంది దర్శకత్వంలో రూపొందబోయే గాంజా శంకర్ ని ఇవాళ అధికారికంగా చిన్న యానిమేటెడ్ టీజర్ తో ప్రకటించారు. కాన్సెప్ట్ ఏంటో చెప్పేశారు.

చిన్నప్పుడే చదువు మానేసి అడ్డమైన అలవాట్లు నేర్చుకుని పెద్దయ్యాక గంజాయి అమ్ముకునే ఒక ఊర మాస్ శంకర్ కథే ఈ సినిమా. పది రూపాయలుంటే పార్కులో, పది వీలుంటే పార్క్ హయత్ లో ఎంజాయ్ చేసే ఇతని నేపథ్యం ఇంత బ్యాడ్ గా ఉన్నా ఒక చిన్న పాపకు ఓ నాన్న అతని స్టోరీని గొప్పగా చెప్పేంత విషయం ఏముందో తెలియాలంటే తెరపైకి వచ్చే దాకా ఆగాలి. దీనికి భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చడం విశేషం. ధమాకా తర్వాత తనకు దక్కిన పెద్ద ఆఫర్ ఇదే. హీరోయిన్ గా పూజా హెగ్డే అనే లీక్ ఉంది కానీ ఇప్పటికైతే ఆ సంగతిని ధృవీకరించలేదు.

ఎప్పుడో సుప్రీమ్ తర్వాత సాయి ధరమ్ తేజ్ మళ్ళీ మాస్ జోలికి వెళ్ళలేదు. ఇక గట్టి హిట్టు కోసం చూస్తున్న సంపత్ నందికి గౌతమ్ నందా,  సీటీమార్ ఫలితాలు నిరాశ పరిచాయి. అందుకే ఎక్కువ సమయం తీసుకుని గాంజా శంకర్ స్క్రిప్ట్ ని సిద్ధం చేసుకున్నాడు. గతం లో రామ్ చరణ్ రచ్చ లాంటి కమర్షియల్ ఎంటర్ టైనర్ తో బ్లాక్ బస్టర్ ఇచ్చాక మళ్ళీ ఆ స్థాయి విజయం దక్కలేదు. ఈసారి తేజుని అంత కంటే ఊర మాస్ గా చూపించబోతున్నాడనే క్లారిటీ అయితే ఈ మినీ టీజర్ లో ఇచ్చారు. రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే దాన్ని బట్టి విడుదల తేదీని నిర్ణయించబోతున్నారు. టైం అయితే పట్టేలా ఉంది