‘బేబి’ ప్రొడ్యూసర్.. నలుగురు డైరెక్టర్లతో

పెట్టుబడి-రాబడి కోణంలో చూస్తే.. ఈ ఏడాదికి బిగ్గెస్ట్ హిట్ ‘బేబి’నే అని చెప్పాలి. లో బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్ల నుంచి రూ.90 కోట్ల దాకా గ్రాస్ రాబట్టడం విశేషం. నాన్-థియేట్రికల్ రైట్స్ ద్వారా కూడా మంచి ఆదాయం తెచ్చిపెట్టిందీ సినిమా. ఈ సినిమాతో పూర్తి స్థాయి నిర్మాతగా మారిన ఎస్కేఎన్‌.. ఊహించని స్థాయిలో లాభాలు అందుకున్నాడు. ఇక వేరే వాళ్ల భాగస్వామ్యం లేకుండా సినిమాలు తీసే స్థితికి చేరుకున్నాడు.

ఇప్పుడతను ఒకేసారి నాలుగు సినిమాలకు రంగం సిద్ధం చేయడం విశేషం. ఎస్కేఎన్ బేనర్లో రాబోయే తర్వాతి నాలుగు చిత్రాలకు దర్శకులు ఖరారయ్యారు. అందులో ఒకరు ‘బేబి’ దర్శకుడు సాయిరాజేషే. వీరి కలయికలో ‘బేబి’ సీక్వెల్ రావొచ్చనే ప్రచారం జరుగుతోంది. అంతే కాక ‘బేబి’ని తమిళంలో తీస్తారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఇదెంత వరకు నిజమో కానీ.. ‘బేబి’ కాంబో మాత్రం మళ్లీ చూడబోతున్నాం.

మరోవైపు సాయిరాజేష్ కథతో ‘కలర్ ఫొటో’ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన సందీప్ రాజ్‌తోనూ ఎస్కేఎన్ ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. అలాగే చాలా ఏళ్ల కిందట ‘ఇంకోసారి’ అనే సినిమా తీసిన సుమన్ పాతూరి కూడా ఎస్కేఎన్‌తో అసోసియేట్ కాబోతున్నాడు. ‘ఇంకోసారి’ హ్యాపీడేస్ తరహాలో సాగే ఫీల్ గుడ్ మూవీ. మంచి సినిమానే కానీ సరిగా ఆడలేదు. మళ్లీ ఇంత కాలానికి సుమన్ తిరిగి మెగా ఫోన్ పడుతున్నాడు.

వీరితో పాటు వెంకట రవీంద్ర అనే కొత్త దర్శకుడితోనూ ఎస్కేఎన్ సినిమా ఉండబోతోంది. ఈ నలుగురు దర్శకులతో ఫొటో దిగి వీరితో తాను సినిమాలు చేయబోతున్న విషయాన్ని వెల్లడించాడు ఎస్కేఎన్. ఒక్క సినిమా విజయం ఒకేసారి నలుగురు దర్శకులతో సినిమా అనౌన్స్ చేసే స్థాయికి తీసుకొచ్చిందంటే అది పెద్ద విశేషమే. ఈ సినిమాల్లో హీరోలెవరు, ఇతర విశేషాలేంటదన్నది త్వరలోనే వెల్లడించనున్నాడు ఎస్కేఎన్.