నాగేశ్వరరావు సమస్య ప్రతి ఒక్కరిది

ఇంకో ఎనిమిది రోజుల్లో విడుదల కాబోతున్న రవితేజ ప్యాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వరరావు ప్రమోషన్ల కోసం రవితేజ నార్త్ నుంచి మొదలుపెట్టి సౌత్ దాకా అన్ని ప్రధాన నగరాలు టూర్లు వేసి ఈవెంట్లు, ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అయితే తమిళ వెర్షన్ కు కనీస థియేటర్లు దొరకడం లేదని, 19నే లియో వస్తున్న కారణంగా డిస్ట్రిబ్యూటర్లు తొంభై శాతానికి పైగా స్క్రీన్లు బ్లాక్ చేసి దానికే కేటాయించారనే వార్తలు ఫ్యాన్స్ ని కలవరపెడుతున్నాయి. మనం స్ట్రెయిట్ డబ్బింగ్ అనే తేడా లేకుండా అందరినీ ఒకేలా ఆదరిస్తుంటే కోలీవుడ్ జనాలు మాత్రం వన్ సైడ్ లవ్ ప్రదర్శిస్తున్నారని విమర్శిస్తున్నారు.

నిజానికి ఈ సమస్య నాగేశ్వరరావుకు కొత్తగా వచ్చింది కాదు. ఎప్పటి నుంచో ఉన్నదే. తమిళ సినిమాలను మన నిర్మాతలు ఫ్యాన్సీ రేట్లకు కొని ఇక్కడ పెద్ద ఎత్తున రిలీజ్ చేయడం దశాబ్దాలుగా కొనసాగుతోంది. కానీ అదే మన వాటిని అక్కడ ఇదే స్థాయిలో విడుదల చేయాలంటే మాత్రం సాధ్యపడదు. గత ఏడాది పొన్నియిన్ సెల్వన్ టైంలోనే చిరంజీవి గాడ్ ఫాదర్ రావడంతో స్క్రీన్లు లేవనే కారణంతో తమిళనాడు రిలీజ్ వారం వాయిదా వేయాల్సి వచ్చింది. గతంలో బాహుబలి, కెజిఎఫ్, ఆర్ఆర్ఆర్ లాంటి అతి కొన్ని మాత్రమే ఆదరణ పొందిన లిస్టులో ఉన్నాయి తప్పించి మిగిలినవి పెద్దగా ఆడిన దాఖలాలు లేవు.

అందుకే తెలుగు డబ్బింగులంటే అరవ పంపిణీదారులు అంత సుముఖంగా ఉండరు. దీని వల్ల ఇక్కడ బ్లాక్ బస్టర్లు సైతం అక్కడ సోసోగా ఆడిన దాఖలాలు బోలెడు, ఈ సమస్య 1980 దశకం మూలాల్లోనే మొదలైపోయింది కాబట్టి ఇప్పుడు పరిష్కారం వెతకడం అంత సులభం కాదు. విజయ్, రజనీకాంత్, అజిత్ లాంటి స్టార్ల సినిమాలు ఉన్నప్పుడు మన వాళ్ళు పోటీకి వెళ్లిన ప్రతిసారి థియేటర్ల ఇబ్బంది తీవ్రంగా ఎదురవుతోంది. లేదూ కాస్త ప్రాధాన్యం దక్కాలంటే వీళ్ళు లేని టైంలో రిలీజ్ చేయడం తప్ప వేరే మార్గం లేదు. కాబట్టి ఇదేదో టైగర్ కు మాత్రమే వచ్చిన ప్రాబ్లమ్ కాదు. ఇక ముందు రిపీట్ కాదన్న గ్యారెంటీ లేదు.