జిగ‌ర్‌తండ‌-2.. పొలిశెట్టి చెయ్యాల్సిందా?

త‌మిళంలో గ‌త ద‌శాబ్ద కాలంలో వ‌చ్చిన బెస్ట్ డ్రామా థ్రిల్ల‌ర్ల‌లో జిగ‌ర్ తండ ఒక‌టి. ఇందులో క‌థ‌.. స్క్రీన్ ప్లే, పాత్ర‌లు.. అన్నీ కూడా వేరే లెవెల్ అన్న‌ట్లుంటాయి. క‌థ‌లో వైవిధ్యంతోనే ప్రేక్ష‌కుల‌ను ఆద్యంతం అల‌రిస్తూ స‌రికొత్త స్ట‌యిల్లో సినిమాను న‌డిపించాడు కార్తీక్ సుబ్బ‌రాజ్. ఈ సినిమా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు ప్రేక్ష‌కాద‌ర‌ణ కూడా బాగానే పొందింది. త‌ర్వాత ఈ సినిమాను తెలుగులో గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌గా రీమేక్ చేశారు. హిందీలో కూడా ఇది రీమేక్ అయింది. జిగ‌ర్‌తండ‌తో త‌న‌పై భారీగా పెరిగిన అంచ‌నాల‌ను కార్తీక్ సుబ్బ‌రాజ్ అందుకోలేక‌పోయాడు.

దానికి సాటి వ‌చ్చే సినిమా ఏదీ తీయ‌లేక‌పోయాడు. ఇప్పుడు అత‌ను జిగ‌ర్ తండ సీక్వెల్‌తో రాబోతున్నాడు. దాని పేరు.. జిగ‌ర్‌తండ డ‌బుల్ ఎక్స్ఎల్. ఈ చిత్రం దీపావ‌ళి కానుక‌గా తెలుగులో కూడా విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్‌లో ప్రెస్‌మీట్‌కు హాజ‌రైన ద‌ర్శ‌కుడు కార్తీక్ సుబ్బ‌రాజ్.. ఈ సినిమా కాస్టింగ్‌కు సంబంధించి ఒక ఆస‌క్తిక‌ర విష‌యం వెల్ల‌డించాడు. ఇందులో ఎస్.జె.సూర్య చేసిన ద‌ర్శ‌కుడి పాత్ర‌కు ఒక ద‌శ‌లో మ‌న న‌వీన్ పొలిశెట్టిని అనుకున్నాడ‌ట‌. ముందు సూర్య‌నే ఈ పాత్ర కోసం అడ‌గ్గా అత‌ను చేయ‌న‌న్నాడ‌ట‌.

దీంతో నవీన్‌ను సంప్ర‌దించాడ‌ట కార్తీక్. అత‌డితో కొన్ని రోజులు సంప్ర‌దింపులు కూడా జ‌రిగిన‌ట్లు కార్తీక్ వెల్ల‌డించాడు. కానీ న‌వీన్ డేట్లు స‌ర్దుబాటు కాక‌పోవ‌డంతో వేరే ఆప్ష‌న్ చూడాల్సి వ‌చ్చింద‌న్నాడు. త‌ర్వాత నిర్మాత కార్తికేయ‌న్ ద్వారా సూర్య‌ను మ‌రోసారి సంప్ర‌దించి.. ఈ పాత్ర‌కు ఒప్పించి సినిమా చేయించిన‌ట్లు కార్తీక్ వెల్ల‌డించాడు. జిగ‌ర్‌తండా లాంటి క్రేజీ మూవీ సీక్వెల్‌కు న‌వీన్‌ను అడిగారంటే అది విశేష‌మే. న‌వీన్ న‌టించి ఉంటే తెలుగులో ఈ సినిమాకు మాంచి క్రేజే వ‌చ్చేదేమో. ఐతే ఎస్.జె.సూర్య‌కు కూడా తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది.