మాట తప్పాడని తలంటిన వాళ్లకు హీరో సమాధానం

సెలబ్రిటీల చేతలే కాదు మాటలకూ చాలా విలువుంటుంది. ఎప్పుడో అనేశాం ఇప్పుడు ఎవరికి గుర్తుంటుందనుకునే కాలం కాదిది. టెక్నాలజీ ప్రపంచంలో ప్రతిదీ ఫోటోలు, స్క్రీన్ షాట్లు, వీడియోల రూపంలో భద్రంగా ఉంటుంది. అందుకే నోరు జారే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి. కానీ బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఇది మర్చిపోయాడు. గతంలో పాన్ మసాలా బ్రాండ్లకు అంబాసడర్ గా పని చేసి వాటి ప్రకటనల్లో నటించినందుకు క్షమాపణ చెబుతూ ఇకపై వాటిని ప్రమోట్ చేయనని చెప్పాడు. సరే అభిమానులతో పాటు సగటు జనాలు కూడా నిజమని నమ్మేశారు.

కట్ చేస్తే నిన్న ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ మ్యాచ్ లో షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్ పాల్గొన్న విమల్ సుపారీ యాడ్ లో అక్షయ్ కుమార్ కూడా దర్శనమిచ్చాడు. పైగా ఆ పలుకులను ఆస్వాదిస్తూ తింటాననే రేంజ్ లో ఎక్స్ ప్రెషన్లు ఇచ్చి రక్తి కట్టించాడు. దీన్ని చూసిన ఆడియన్స్ షాక్ తిన్నారు. అంతే ఒక్కసారిగా సోషల్ మీడియా వేదికగా అతని మీద విరుచుకుపడ్డారు. అప్పుడేదో గొప్పలు పోయి ఇప్పడేలా మాట తప్పావని, డబ్బుల కోసం ఏమైనా చేస్తారా అంటూ ఓ రేంజ్ లో క్లాసులు పీకుతున్నారు. నిజానికి అక్షయ్ కుమార్ కి తాను గతంలో అన్నది గుర్తుందో లేదోనని.

ఇది గంటల వ్యవధిలో వైరల్ టాపిక్ అయ్యింది. అసలు ట్విస్టు ఏంటో స్వయంగా అక్షయ్ వివరించాడు. ఇప్పుడు ప్రసారమవుతున్న యాడ్స్ అక్టోబర్ 2021లో షూట్ చేసినవని, లీగల్ గా వచ్చే నెలాఖరు వరకు ప్రసారం చేసుకునే హక్కు ఉంటుందని, కాబట్టి ఈ విషయంలో నేనేం చేయలేదని తేల్చి చెప్పాడు. తన ప్రకటన ఆ షూటింగ్ అయ్యాక ఇచ్చిందని గుర్తించాలని నొక్కి వక్కాణించాడు.
సో డౌట్ దాదాపు తీరిపోయినట్టే. అసలే విపరీతంగా కష్టపడ్డ మిషన్ రాణిగంజ్ ఊహించని స్థాయిలో డిజాస్టర్ కావడం ఫ్యాన్స్ జీర్ణించుకోలేని టైంలో ఈ వివాదం రేగడం చల్లారడం జరిగిపోయాయి