ఓటిటి అభిమానులకు ప్రైమ్ షాక్  

ఏదైనా ఓటిటి యాప్ కి ఏడాది పాటు చందా కడితే నిశ్చింతగా బోలెడు కంటెంట్ చూసుకోవచ్చనే ట్రెండ్ ఇండియాలో ఉధృతం చేసింది అమెజాన్ ప్రైమే. ముఖ్యంగా కరోనా టైంలో దీని సేవలు అందుకున్న వినియోగదారులు లక్షల నుంచి కోట్లలోకి పెరిగిపోయారు. అయితే క్రమంగా తన బిజినెస్ మోడల్ ని బయట పెడుతున్న యాజమాన్యం కొన్నాళ్ల క్రితం రెంటల్ పద్ధతి మొదలుపెట్టి ఫస్ట్ షాక్ ఇచ్చింది. 75 రూపాయలతో మొదలుకుని 400 రూపాయల దాకా స్టోర్ అనే ఆప్షన్ లో డబ్బులు చెల్లించి కొత్త సినిమాలు చూసే సిస్టంని పరిచయం చేసింది. దీని మీద ఎన్ని విమర్శలు వచ్చినా తగ్గలేదు.

ఫ్రెష్ గా రాబోయే ట్విస్ట్ ఏంటంటే త్వరలో ప్రైమ్ లో యూట్యూబ్ తరహాలో ప్రకటనలు రాబోతున్నాయట. ఒకవేళ వాటిని వద్దనుకుంటే ఇప్పుడు రెగ్యులర్ గా చెల్లించే మొత్తానికి అదనంగా మరికొంత సొమ్ము కడితే యాడ్స్ లేకుండా నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ అందుకోవచ్చు. తొలుత యుఎస్, యుకె, జర్మనీ, కెనడాలో తీసుకొచ్చి ఆ తర్వాత ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, మెక్సికో, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో లాంచ్ చేస్తారు. భారతదేశానికి ఎప్పుడనే దాని మీద ఇంకా సరైన సమాచారం లేదు. మనకేదో ప్రత్యేకంగా మినహాయిస్తారని ఎలాంటి గ్యారెంటీ లేదు. అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.

నిజానికీ యాడ్స్ ప్రహసనం ఆహా, డిస్నీ హాట్ స్టార్ లాంటి వాటిలో ఆల్రెడీ ఉంది. ప్రీమియం ప్యాక్ తీసుకుంటే తప్ప వీటిని తప్పించుకోలేం. ఇప్పుడు ప్రైమ్ కూడా అదే దారిలో వెళ్లబోతోంది. అంటే రెగ్యులర్ రేట్లతో ఓటిటిని చూడాలంటె అచ్చం శాటిలైట్ ఛానల్స్ తరహాలో ప్రతి పావుగంటకోసారి ప్రకటనలు భరించాల్సి ఉంటుందన్న మాట. ఏదైనా ట్రెండ్ ని మెల్లగా అలవాటు చేసి దానికి అడిక్ట్ అయిపోయాక క్రమంగా వాతలు పెట్టుకుంటూ పోవడమంటే ఇదేనేమో. రాబోయే రోజుల్లో ఇంకెన్ని చిత్ర విచిత్ర పరిణామాలు, మార్పులు చూడాల్సి ఉంటుందో. కొత్తొక వింత పాతొక రోతని పెద్దలు ఊరికే అనలేదు.