నిత్య మీనన్ గురించి అర్థం లేని ప్రచారం

గ్లామర్ షోకి దూరంగా నటనకు స్కోప్ ఉన్న పాత్రలను ఏరికోరి మరీ ఎంచుకునే టాలెంటెడ్ హీరోయిన్లలో నిత్య మీనన్ ముందు వరసలో ఉంటుంది. స్వప్న సినిమా భాగస్వామ్యంలో తను నటించిన కొత్త వెబ్ సిరీస్ శ్రీమతి కుమారి ఈ శుక్రవారం నుంచి ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్లలో బిజీగా ఉన్న ఈ కేరళ కుట్టి మీద నిన్నటి నుంచి ఒక వింత ప్రచారం జరుగుతోంది. గతంలో ఒక తమిళ హీరో తనను విపరీతంగా వేధించాడని, దాని వల్ల మానసికంగా చాలా క్షోభకు గురి కావాల్సి వచ్చిందని ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా వచ్చిన వార్త బాగా వైరల్ అయ్యింది.

కామెడీ ఏంటంటే నిత్య మీనన్ అసలలా ఎవరితోనూ అనలేదట. అయినా పేరు చెప్పకుండా ఎవరో వేధించారని చెప్పడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని తనకూ తెలుసు. కొన్నేళ్ల క్రితం పలువురు బాలీవుడ్ కోలీవుడ్ హీరోయిన్లు పేర్లు చెప్పి మరీ మీ టూ ఉద్యమం లేవనెత్తితే తర్వాత దాని గురించి పట్టించుకున్న నాథుడు లేడు. ఇండస్ట్రీ పోకడ అలా ఉంది. పోనీ ఎవరైనా బలమైన సాక్ష్యాధారాలు చూపిస్తారా అంటే అదీ ఉండదు. అలాంటప్పుడు ఇలా చెప్పుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇదంతా తెలియనంత అనుభవలేమి నిత్య మీనన్ కి లేక కాదు.

కుమారి శ్రీమతి ప్రమోషన్లలో భాగంగా దానికి హైప్ రావడం కోసం ఇలా చేశారన్న కామెంట్స్ లేకపోలేదు కానీ ఇదంతా వట్టి సోషల్ మీడియా ఫార్స్ వ్యవహారంలాగే చూడాలి. ఆ మధ్య భీమ్లా నాయక్ లో పవన్ కళ్యాణ్ సరసన జోడి కట్టిన నిత్య మీనన్ సహజంగా ఉండే తన బొద్దుతనానికి స్వస్తి చెప్పి ఇప్పుడు చక్కని రూపంలో ఉంది. అయినా అవకాశాలు ఇబ్బడి ముబ్బడిగా రావడం లేదు కానీ పెర్ఫార్మన్స్ డిమాండ్ చేసే పాత్రలు వస్తే మాత్రం నో చెప్పడం లేదు. స్వంత ఇంటి కోసం మద్యం షాపు పెట్టేందుకు వెనుకాడని యువతిగా శ్రీమతి కుమారిలో నిత్య మీనన్ చాలా డిఫరెంట్ గా కనిపించనుందట.