హమ్మయ్యా .. ఏజెంటుకి మోక్షం దక్కింది

ఇంక రాదేమో మళ్ళీ చూడలేమేమో అని తెగబాధపడుతున్న అక్కినేని అభిమానులకు ఊరట కలిగిస్తూ ఏజెంట్ ఓటిటి స్ట్రీమింగ్ సెప్టెంబర్ 29 అంటే వచ్చే వారం జరగనుంది. ఈ మేరకు సోనీ లివ్ ప్రత్యేకంగా ఒక ట్రైలర్ తో పాటు ఈ విషయాన్ని ప్రకటించింది. ఎప్పుడో ఏప్రిల్ లో రిలీజైన ఒక పెద్ద సినిమా ఇప్పటిదాకా డిజిటల్ వెలుగు చూడకపోవడం దీని విషయంలోనే జరిగింది. నిర్మాత అనిల్ సుంకర సైతం దీని గురించి క్లారిటీ ఇవ్వలేకపోవడంతో అయోమయం పెరుగుతూ వచ్చింది. ఎట్టకేలకు కనీసం టీవీలో కూడా రాదని ఫీలవుతున్న టైంలో ఫైనల్ గా గుడ్ న్యూస్ వచ్చేసింది.

నిజానికి ఇంత ఆలస్యం ఎందుకు చేశారనేది మాత్రం అంతు చిక్కలేదు. ఒకవేళ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఏమైనా కోర్టు కేసు ఉందా అంటే దానికి ఓటిటికి లింక్ లేదు. అలాంటప్పుడు నెలల తరబడి ఆపడం అనూహ్యం. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ ప్యాన్ ఇండియా మూవీ కనీసం యాభై శాతం రికవరీ కూడా చేయలేక టాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా చోటు సంపాదించుకుంది. ఫ్యాన్స్ కొందరు అసలిది రాకపోవడమే మంచిదనుకున్నారు కానీ ఎట్టకేలకు వెలుగు చూస్తోంది. సాక్షి వైద్య హీరోయిన్ గా నటించిన ఏజెంట్ కు హిప్ హాప్ తమిళ సంగీతం మైనస్ అయ్యింది.

దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటుంది. హిట్టు ఫ్లాపు ఫలితంతో ఏదైనా సినిమా ఓటిటి బజ్ కూడా ఆధారపడి ఉంటుంది. కరోనా టైంలో బాలేని వాటిని కూడా జనం ఆదరించారనే లెక్క ఇప్పుడు పని చేయడం లేదు. సోషల్ మీడియాలో ఏదైనా మూవీ ట్రోల్ అయ్యిందా చాలు. దాన్ని ఉచితంగా అయినా సరే కన్నెత్తి చూసేందుకు ఇష్టపడటం లేదు. డబ్బులు ఖర్చు లేదు కానీ సమయం వెచ్చించాలిగా.  మరి ఇదే సంస్థ నిర్మించిన భోళా శంకర్ లాగా ఏజెంట్ కూడా ట్రోలింగ్ కి బలవుతాడా లేక ఓసారి చూడొచ్చనే ఫీడ్ బ్యాక్ తెచ్చుకుంటాడా చూడాలి. లెట్ వెయిట్ అండ్ సీ.